'షారుక్ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్, దేశం విడిచి వెళ్లవచ్చు'
లక్నో: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పైన విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాద్వీ ప్రాచీ సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్ అని ఆరోపించారు. ఆయనకు నచ్చకుంటే దేశం విడిచి వెళ్లిపోవచ్చునని విరుచుకుపడ్డారు.
అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న షారుక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలన్నారు. షారుక్ వ్యాఖ్యలు తీవ్రమైనవన్నారు. అలాగే, అవార్డులు వెనక్కి ఇస్తున్న వారి పైన కూడా ఆమె మండిపడ్డారు. అవార్డులు వెనక్కి ఇస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారు ఎందుకు ఇస్తున్నారో తెలిసిపోతుందని అభిప్రాయపడ్డారు.
సాద్వీ ప్రాచీ గతంలోను షారుక్ ఖాన్ పైన మండిపడిన సందర్భాలు ఉన్నాయి. బాద్ షా సినిమాలు చూడ్డానికి వీల్లేదని ఆమె గతంలో అన్నారు. షారుక్ ఖాన్ సినిమాల వల్ల యువత పెడదోవ పడుతోందన్నారు.
అవార్డులు వెనక్కి ఇస్తున్న వారిపై వెంకయ్య ఆగ్రహం
దేశంలో సహనశీలత తగ్గిందని కాంగ్రెస్ ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం మండిపడ్డారు. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలనేది ఈ శతాబ్దపు జోక్ అన్నారు. దేశంలో ప్రజల హక్కులు హరించిందెవరని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతలను జైల్లోకి నెట్టింది, ఎమర్జెన్సీని విధించింది ఎవరని నిలదీశారు. మతోన్మాద శక్తులను పెంచి పోషించిన కాంగ్రెస్ ఇప్పుడు సహలశీలత గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. కాశ్మీర్ పండిట్లను, సిక్కులను ఊచకోత కోసినప్పుడు కాంగ్రెస్ ఎక్కడుందన్నారు.