సుందరమైన సహారా ఆంబే వ్యాలీ వేలం నేడే: ధర రూ.37,392కోట్లు
సహారా గ్రూపునకు చెందిన అత్యంత ఖరీదైన ఆంబీ వ్యాలీ వేలానికి తేదీ ఖరారైంది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన మూడు రోజుల తర్వాత ఈ ప్రతిష్టాత్మక భవనాలను బాంబై హైకోర్టు సోమవారం వేలం వేయనుంది.
న్యూఢిల్లీ: సహారా గ్రూపునకు చెందిన అత్యంత ఖరీదైన ఆంబీ వ్యాలీ వేలానికి తేదీ ఖరారైంది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన మూడు రోజుల తర్వాత ఈ ప్రతిష్టాత్మక భవనాలను బాంబై హైకోర్టు సోమవారం వేలం వేయనుంది. వేలం నిలిపివేతకు సహారా గ్రూపు అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో సహారా గ్రూపునకు ఎంతో కీలకమైన పణె లోనావాలాలోని వ్యాలీని సోమవారం బహిరంగ వేలం వేయనున్నారు.
విలువెంతో తెలుసా?
అధికారిక లిక్విడేటర్ విలువ రూ. 37,392 కోట్లుగా రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఈ భారీ మొత్తం చెల్లించి ఎవరు ఈ వ్యాలీని దక్కించుకుంటారో మరి. కాగా, వేలం ప్రక్రియ నిలిపివేస్తే.. రూ.1,500 కోట్లను తక్షణం చెల్లిస్తామని సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ చేసిన ప్రతిపాదనను కోర్టు తిరస్కరించింది. కాగా, ఆంబే వ్యాలీని వదులుకోలేక సహారా చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్లే తెలుస్తోంది.
సుందర నిర్మాణం
పుణె-ముంబై రహదారిపై లోనవాలా దగ్గరున్న ఆంబీ వ్యాలీ కొండల మధ్య సహారా గ్రూపు సుందర నగరాన్ని నిర్మించింది. ప్రైవేట్ ఎయిర్పోర్టు, హాస్పిటల్, లగ్జరీ రిసార్టులు లాంటి విలాసవంతమైన సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఈ వ్యాలీలోని ప్రాపర్టీల నిర్మాణం కోసం అవసరమైన పెట్టుబడులను గ్రూపునకు చెందిన పలు సంస్థల నుంచి సేకరించింది.
పెట్టుబడులు ఇలా..
సెబీ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్ప్, సహారా హౌజింగ్ ఇన్వెస్ట్ కార్ప్ సంస్థలు ఆంబీ వ్యాలీ లిమిటెడ్ షేర్లు, డిబెంచర్లలో రూ.6,700 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. ఆ తర్వాత ఈ పెట్టుబడులను సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, సహారా క్యూ షాప్కు విక్రయించినట్లు ఆ రెండు సంస్థలు సుప్రీంకోర్టుకు వెల్లడించాయి.
తీవ్రంగా ప్రయత్నించినా..
ఆంబీ వ్యాలీ ఆస్తులను విక్రయించడం ద్వారా డిపాజిటర్ల సొమ్మును తిరిగిచ్చేయాలన్న ప్రతిపాదనను సహారా గ్రూపు గతంలో తీవ్రంగా ప్రతిఘటించింది. తాజా విచారణలోనూ సహారా గ్రూపు తరఫున న్యాయవాది కపిల్ సిబల్ ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ కోర్టు అటాచ్మెంట్ ఆదేశాలిచ్చింది.
6761ఎకరాల్లో..
ఈ వ్యాలీ 6,761 ఏకరాల్లో ఉంది. సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఉన్న ఈ వ్యాలీలో గోల్ఫ్ కోర్స్, ఎయిర్పోర్టు, హాస్పిటల్, అడ్వెంచర్ స్పోర్ట్స్, రీటేల్, ఎంటర్టైన్మెంట్, ఇంటర్నేషనల్ స్కూల్ వంటి అధునాతన సదుపాయాలున్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు.