ఎస్పీ బాలు కోసం .. సల్మాన్ ఖాన్ ట్వీట్ .. మామా త్వరగా కోలుకోండి అంటూ తమన్ భావోద్వేగం
చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో కరోనాతో బాధపడుతూ చికిత్స కోసం చేరిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు అనుకున్న సమయంలో మరోమారు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బాలు ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఎంజీఎం వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో ఎస్పీ బాలు కోలుకోవాలని ప్రతి ఒక్కరు ప్రార్ధనలు చేస్తున్నారు.
బెజవాడలో బాలు క్షేమం కోసం ... మృత్యుంజయ యాగం నిర్వహించిన అభిమానులు
బాలసుబ్రహ్మణ్యం సర్ .. లవ్ యూ సర్ ... సల్మాన్ ట్వీట్
ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సైతం సోషల్ మీడియా వేదికగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సల్మాన్ ఖాన్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు . బాల సుబ్రహ్మణ్యం సర్... మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నా కోసం పాడిన ప్రతి పాటకు ధన్యవాదాలు. మీరు నా కోసం పాడిన ప్రతి పాట నాకు ఎంతో ప్రత్యేకం. మీ దిల్ దివానా హీరో ప్రేమ్ ... లవ్ యు సర్ .. అని సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్లో బాలసుబ్రమణ్యం పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు.
బాలు ఆరోగ్యం కోసం ఆందోళనలో సినీ పరిశ్రమ , పలువురు ప్రముఖుల ట్వీట్
మరోవైపు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమంగా మారిన నేపథ్యంలో నిన్న రాత్రి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, కమల్ హాసన్ తదితరులు ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని,త్వరగా కోలుకోవాలని రాధిక, మంచు లక్ష్మి, ఖుష్బూ, గీతా మాధురి,చిన్మయి, హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు ఎస్పీ బాలసుబ్రమణ్యం కోసం ట్వీట్లు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ భావోద్వేగంతో మామ దయచేసి త్వరగా కోలుకోండి అంటూ ట్వీట్ చేసారు. ఆయన తన ట్వీట్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు .
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ భావోద్వేగ ట్వీట్
లాక్ డౌన్ కు ముందు మార్చి నెలలో నాకెంతో ప్రియమైన మామతో మేమంతా సరదాగా గడిపాం .ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడంలేదు .ఆయన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థించండి. మామా ..త్వరగా కోలుకోండి అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎస్పీ బాలు కోలుకుంటున్నారు అని ఊపిరి పీల్చుకున్న అభిమానులు మరోమారు ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు పేర్కొనటంతో ఆందోళనలో ఉన్నారు . ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోసం దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు పూజలు , ప్రార్ధనలు చేస్తున్నారు .
Recommended Video
ఎస్పీబీ ఎంతో ప్రత్యేకం ... సినీ రంగంలో ఆయన ప్రతిభకు లేదు కొలమానం
ఆరు జాతీయ అవార్డులను అందుకున్న ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 16 భాషలలో 40,000 పాటలను పాడి నేపధ్య గాయకుల్లో అగ్రగణ్యుడిగా నిలిచారు. ఆయన ఇళయరాజా, ఎ ఆర్ రెహమాన్ వంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ లతో కలిసి పనిచేశాడు. ఆయన నటుడు, నిర్మాత మాత్రమే కాకుండా తన వాయిస్ ను నటులకు డబ్బింగ్ కూడా అందించారు . బాలసుబ్రహ్మణ్యం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ మరియు పద్మ భూషణ్ లను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నై ఆస్పత్రిలోఎక్మో సహాయంతో చికిత్స పొందుతున్నారు .