కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై సల్మాన్ ఖుర్షిద్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షిద్ సొంతపార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఫల్యాలను గుర్తించడంలో జాప్యం కారణంగానే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అంతేగాక, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణాలు కూడా ఇంతవరకు పూర్తిగా తెలుసుకోలేకపోయామని చురకలంటించారు.

రాహుల్ గాంధీ పట్టించుకోవడం లేదు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీని ఆగస్టులో నియమించుకున్నామని, ఆ తర్వాత పూర్తిస్థాయి అధ్యక్ష పదవి కోసం ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని సల్మాన్ ఖుర్షిద్ వాపోయారు.
ఇక తమ నాయకుడు రాహుల్ గాంధీ వీటన్నింటికీ దూరంగా ఉంటున్నారని, ఆయనే అధ్యక్షుడిగానే ఉండాల్సిందన్నారు.

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అంతే సంగతులు
సరైన నాయకుడు లేకపోవడమే తమ పార్టీకి పెను సమస్యలా మారిందని సల్మాన్ ఖుర్షిద్ ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ బాధ్యతలు తీసుకున్నా.. ఆమె తనని తాను తాత్కాలిక అధ్యక్షురాలిగానే భావిస్తున్నారని, ఇలాగైతే రానున్న రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో చాలా కష్టతరంగా మారుతోందని సల్మాన్ ఖుర్షిద్ వ్యాఖ్యానించారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవమే..
కాగా, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 542 పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేయగా 52 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. కాగా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 303 స్థానాలను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అక్టోబర్ 21న జరిగే హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. కాగా, ఈ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.

హర్యానా, మహారాష్ట్రాల్లోనూ ఎదురుదెబ్బలే..
ఇటీవల హర్యానా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న విభేదాల కారణంగా ఆ పార్టీ అధ్యక్ష పదవికి అశోక్ తన్వర్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా హర్యానా కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా మారింది. బీజేపీకి మరింత సానుకూల అంశంగా మారింది. ఇక మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాను సూచించిన వ్యక్తులకు టికెట్లు కేటాయించకపోవడంతో కీలక నేత సంజయ్ నిరుపమ్ కూడా పార్టీకి రాజీనామా చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.












Click it and Unblock the Notifications