కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు ? కౌంటింగ్ వేళ శశిథరూర్ సంచలనం
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో చురుగ్గా జరుగుతోంది. ఈ సమయంలో అధ్యక్ష ఎన్నికల అభ్యర్ది శశిథరూర్ సంచలనం రేపారు. ఇప్పటివరకూ ఎన్నికల్లో అధిష్టానం పక్షపాతం లేకుండా ఇద్దరు అభ్యర్ధుల్ని సమానంగానే చూసిందని, ఎన్నికలు సజావుగానే జరిగాయని చెప్పుకుంటూ వస్తున్న థరూర్.. అకస్మాత్తుగా సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశి థరూర్ ఎన్నికల ఏజెంట్ సల్మాన్ సోజ్ ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూధన్ మిస్త్రీకి లేఖ రాశారు. ఇందులో పలు ఆరోపణలు చేశారు.యూపీలో అధ్యక్ష ఎన్నికల నిర్వహణలో చాలా తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. యూపీలో పోలైన ఓట్లు చెల్లనవిగా ప్రకటించాలని ఆయన కోరారు. దీంతో ఈ వ్యవహారం కౌంటింగ్ వేళ కలకలం రేపుతోంది.
కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే థరూర్ టీమ్ ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు చేసింది. తాము నిరంతరం ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఆఫీసుతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు తెలిపింది. ఎన్నికల్లో పలు సమస్యలపై ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. తాజాగా మిస్త్రీకి రాసిన లేఖలో థరూర్ ఎన్నికల బృందం.. యూపీలో ఎన్నికల నిర్వహణలో చాలా తీవ్రమైన అవకతవకలను మీ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపింది. యూపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ లో విశ్వసనీయత, సమగ్రత లేదని తెలిపింది.
అయితే మల్లికార్జున్ ఖర్గే, ఆయన మద్దతుదారులు యూపీలో ఎన్నికల అక్రమాలకు పాల్పడిన అంశఁపై తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కూడా థరూర్ టీమ్ వెల్లడించింది. ఈ విషయం కూడా ఖర్గేకు తెలియదని, తెలిస్తే ఆయన అనుమతించబోరని కూడా థరూర్ బృందం పేర్కొంది. కాంగ్రెస్ కు చాలా ముఖ్యమైన ఈ అధ్యక్ష ఎన్నికలను కలుషితం చేసేందుకు ఖర్గే ఎట్టి పరిస్ధితుల్లో అనుమతించరని, కానీ ఆయన అనుచరులు మాత్రం ఇలా చేశారని తెలిపింది. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.