ఆత్మహత్య వార్తలను ఖండించిన శశికళ: 'అందులో ఎలాంటి వాస్తవం లేదు'
సీఎం పదవిపై భారీ ఆశలు పెట్టుకున్న శశికళ.. ఆ పదవి దక్కకపోతే ఆత్మహత్యకు పాల్పడుతారని సామాజిక మాద్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
చెన్నై: తమిళ రాజకీయాల్లో కొనసాగుతోన్న హైడ్రామాకు ఎంతకీ తెరపడకపోగా.. ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఆపద్దర్మ సీఎం పన్నీర్, అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ నడుమ వార్ మరింత ముదురుతోంది.
గవర్నర్ చేస్తోన్న జాప్యంతో తీవ్ర అసహనంలో ఉన్న శశికళ.. నేరుగా గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లి.. తన ఎమ్మెల్యేల సంఖ్యను లెక్కబెట్టుకోండి అని సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో సీఎం పదవిపై భారీ ఆశలు పెట్టుకున్న శశికళ.. ఆ పదవి దక్కకపోతే ఆత్మహత్యకు పాల్పడుతారని సామాజిక మాద్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పైగా ఇదే విషయాన్ని గవర్నర్ కు రాసిన లేఖలోను ఆమె ప్రస్తావించారని చెబుతూ ఆ ప్రచారం మరింత ఊపందుకోవడం గమనార్హం.
కాగా, తనపై జరుగుతోన్న వ్యతిరేక ప్రచారంపై శశికళ స్పందించారు. తనపై జరుగుతోన్న దుష్ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని శశికళ అన్నారు. ఎంపీలంతా పన్నీర్ వైపు మళ్లుతున్నారంటే.. ఆ కుట్ర వెనుక ఎవరున్నారనేది స్పష్టంగా అర్థమవుతోందని శశికళ వ్యాఖ్యానించారు.