సీఎం పగ్గాలు కూడా‘చిన్నమ్మ శశికళ’కే ! ఒకటే భజన
తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చిన్నమ్మ శశికళ నటరాజన్ కు కట్టబెట్టాలని అన్నాడీఎంకే నాయకులు, మంత్రులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చిన్నమ్మ శశికళ నటరాజన్ కు కట్టబెట్టాలని అన్నాడీఎంకే నాయకులు, మంత్రులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవితో పాటు సీఎం పదవి చేపట్టాలని సీనియర్ మంత్రులు శశికళ కాళ్ల మీద పడిపోయారు.
అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకులు శశికళను కలిసి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవితో పాటు సీఎంగా మీరే ఉండాలని, అమ్మ జయలలిత లేని లోటు మీరే తీర్చాలని మనవి చేస్తూ వినతి పత్రం సమర్పించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై తదితర సీనియర్ నాయకులు ఇప్పటికే శశికళను కలిసి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని శశికళకు మనవి చేసిన విషయం తెలిసిందే.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత జీవితాంతం ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమ్మ లేరు కాబట్టి అన్నాడీఎంకే పగ్టాలతో పాటు సీఎం పదవి మీరే చేపట్టాలని శశికళకు మనవి చేశారు. ఇప్పటికే చెన్నై నగరంలో శశికళ పేరు మీద పెద్దపెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారు.
అన్నాడీఎంకేలో ప్రధాన విభాగం అయిన జయలలిత పెరవై కూడా శశికళకు పూర్తి మద్దతు ఇచ్చింది. శశికళ రెండు పదవులు చేపట్టాలని తీర్మానించారు. అంతేకాకుండా ఇంతకు ముందు జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ నుంచి శశికళ పోటీ చెయ్యాలని మనవి చేశారు.
జయలలిత పెరవై కార్యదర్శి, తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.బీ. ఉదయ్ కుమార్, సమాచార శాఖా మంత్రి కదంబూర్ రాజు, దేవాదాయ శాఖా మంత్రి సెవూర్ ఎస్. రామచంద్రన్ తదితరులు 'తాయి తంట వరం'(అమ్మ ఇచ్చిన వరమే చిన్నమ్మ) అనే శీర్షికతో ఓ కాపీని శశికళకు అందించారు.
తమిళనాడు రెవెన్యూ శాఖా మంత్రి ఉదయ్ కుమార్ నేతృత్వంలో జయలలిత పెరవై నాయకులు శశికళను కలిసి సీఎం పదవి మీరే తీసుకోవాలని మనవి చేశారు. తమిళనాడు గృహ నిర్మాణ శాఖా మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్ నేతృత్వంలోని నాయకులు ఇదే డిమాండ్ చేస్తున్నారు.

శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడం ద్వారా కోటిన్నర మంది అన్నాడీఎంకే సభ్యులను, సీఎం పదవి చేపట్టడం ద్వారా ఏడు కోట్ల మంది తమిళనాడు ప్రజలను కంటికి రెప్పలా కాపాడాలని అంటున్నారు.
తమిళనాడులోని వివిధ జిల్లాల్లో ఉన్న మంత్రులు సైతం శశికళ సీఎంగా ఉండాలని తీర్మానించి వాటి కాపీలను శశికళకు అందించారు. ఎంజీఆర్ కాలం నుంచి మంత్రులుగా పని చేసిన సీనియర్ నాయకులు సైతం ఇప్పుడు ఏమీ చెయ్యలేక శశికళ సీఎం కావాలంటూ భజన చేస్తున్నారు.
మొత్తం మీద జయలలిత లేకపోవడంతో ఇప్పుడు అంతా చిన్నమ్మ చిన్నమ్మ అంటూ ఆమె కాళ్లమీద పడుతున్నారు. తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారడంతో ఎప్పుడు ఏమీ జరుగుతుందో అంటూ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.












Click it and Unblock the Notifications