లవ్ జిహాద్ చట్టాల రాజ్యాంగ బద్ధత తేల్చేందుకు సుప్రీం ఓకే- స్టేకు మాత్రం నిరాకరణ
బలవంతపు మతమార్పిళ్లకు వ్యతిరేకంగా యూపీ, ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రభుత్వాలు తీసుకొచ్చిన లవ్ జిహాద్ చట్టాల రాజ్యాంగ బద్ధతను తేల్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ రెండు రాష్ట్రాలు అమల్లోకి తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. నాలుగు వారాల్లో వీటిపై విచారణ జరుపుతామని ప్రకటించింది.
యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో బలవంతపు మతమార్పిళ్లు జరుగుతున్నాయంటూ వాటికి వ్యతిరేకంగా మతమార్పిళ్ల వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చాయి. లవ్ జిహాద్ అనే కొత్త పదం కనిపెట్టి, దానికి విరుగుడుగా ఈ చట్టాలు పనిచేస్తాయంటూ బీజేపీ ప్రభుత్వాలు ఈ చట్టాలను అమలు చేస్తున్నాయి. ఇందులో మతాంతర వివాహాల చేసుకుంటే చాలు వారిని అరెస్టు చేసి జైళ్లకు పంపుతున్నారు. దీంతో బీజేపీ ప్రభుత్వాల చర్యలపై జనంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల లవ్ జిహాద్ వ్యతిరేక చట్టాలపై ప్రాథమిక విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వీటిపై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వాల వాదన వినకుండా వీటిపై స్టే ఎలా ఇస్తామని జస్టిస్ బాబ్డే ప్రశ్నించారు.
అయితే చట్టాల రాజ్యాంగ బద్ధత తేల్చాలన్న డిమాండ్ను మాత్రం ఆయన అంగీకరించారు. ఈ రెండు రాష్ట్రాల తరహాలోనే మధ్యప్రదేశ్లోని శివరాజ్సింగ్ చౌహాన్ సర్కారు కూడా ఇదే తరహా చట్టాన్ని ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్య్లంలో సుప్రీంకోర్టు వీటి రాజ్యాంగ బద్ధత తేల్చాలని నిర్ణయించడం సానుకూల అంశమని పిటిషనర్లు చెబుతున్నారు.