ఆధార్-ఓటర్ ఐడీ కార్డుల లింకేజీపై సుప్రీంకోర్టు కీలక సూచన: కాంగ్రెస్కు షాక్
న్యూఢిల్లీ: పోలింగ్ సమయంలో అక్రమాలను అడ్డుకోవడానికి ఉద్దేశించిన ఆధార్-ఓటర్ గుర్తింపు కార్డు లింకేజీ ప్రక్రియపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన అభిప్రాయాన్ని వెలువడించింది. ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీని అనుసంధానించేలా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణ్దీప్ సింగ్ సుర్జేవాలా దాఖలు చేసిన పిటీషన్ ఇది.
ఈ చట్టం వల్ల పౌరుల గోప్యత హక్కుకు భంగం వాటిల్లుతోందంటు ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఉభయసభల్లో వెల్లువెత్తిన అభ్యంతరాలను సైతం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తన పిటీషన్లో పొందుపరిచారు. ఉభయ సభల్లో తనకు ఉన్న బలంతో ఏకపక్షంగా దీన్ని ఆమోదింపజేసుకుందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కనీసం సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ సభ్యులు చేసిన డిమాండ్ను కూడా పట్టించుకోలేదని చెప్పారు.
కీలకమైన ఈ బిల్లును 24 గంటల వ్యవధిలోనే ఆమోదింపజేసుకుందని, ప్రతిపక్ష సభ్యుల గళాన్ని అణచివేసిందంటూ రణ్దీప్ సింగ్ సుర్జేవాలా స్పష్టం చేశారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన గోప్యత హక్కును ఉల్లంఘించినట్టేనని అన్నారు. ఈ పిటీషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఇవ్వాళ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బొపన్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వద్దకు పిటీషన్ విచారణకు వచ్చింది.
దీన్ని పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. విచారణను ముందుకు కొనసాగించడానికి ధర్మాసనం నిరాకరించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఎన్నికల సవరణ చట్టంలోని సెక్షన్ 4, 5ల చట్టబద్ధతను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఇప్పటికే విచారణ దశలో ఉన్నాయని గుర్తు చేసింది. ఈ పరిస్థితుల్లో దీన్ని విచారించడం సరైంది కాదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవడానికి పిటీషనర్కు స్వేచ్ఛను ఇస్తున్నామని జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.