కామన్ సివిల్ కోడ్ పై బీజేపీకి షాక్-చట్టం చేయాలన్న పిల్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేయాలన్న బీజేపీ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి పౌరస్మతి అమలు కోసం పార్లెమంటులో చట్టం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజనవాజ్యాన్ని సుప్రీంకోర్టు ఇవాళ తోసిపుచ్చింది. అంతే కాదు దీనిపై కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.
అన్ని మతాలలో ట్రస్ట్లు, ధార్మిక సంస్థలు, మతపరమైన సంస్ధల కోసం ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి రావాలని, వక్ఫ్లు, వక్ఫ్ ఆస్తులను నియంత్రించే ప్రత్యేక చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ 1995 వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయలేరని జస్టిస్ డి.వై నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. పార్లమెంటు ఆమోదించిన చట్టం ముస్లింలకు ప్రత్యేక ఆదరణను కల్పించిందని, హిందువులు, ఇతర విశ్వాసాల అనుచరుల పట్ల వివక్ష చూపుతుందని పిటిషనర్ చేసిన ఆరోపణలపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
మీరు ఈ చట్టానికి బాధితులైతే దాని చెల్లుబాటును సవాలు చేయవచ్చని పిటిషనర్ కు సుప్రీంకోర్టు సూచించింది. అంతే కానీ మీరు ఈ చట్టాన్ని సవాలు చేయలేరని తెలిపింది. వక్ఫ్ చట్టం కారణంగా మీ ఆస్తి నష్టపోయారా, మీ సమస్య ఏమిటని జస్టిస్ జస్టిస్ చంద్రచూడ్ పిటిషనర్ ఉపాధ్యాయిని ప్రశ్నించారు.హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర ఇస్లామేతర మత వర్గాల ప్రయోజనాలు ఈ విషయంలో ముడిపడి ఉన్నాయని, అలాగే వక్ఫ్ బోర్డులకు అంతులేని అధికారాలు, వక్ఫ్ ఆస్తులకు ప్రత్యేక హోదా కల్పించడం వల్ల సాధారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. అందువల్ల ఇతరులు చట్టం ముందు వివక్షకు గురవుతున్నారు కాబట్టి చట్టం యొక్క సమాన రక్షణను తొలగించాలని కోరారు.
దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. అలా అయినా మీకు ఈ చట్టంతో ఎలా నష్టం జరిగిందని ప్రశ్నించారు. దీనికి పిటిషనర్ వద్ద సమాధానం లేదు. అనంతరం ఉమ్మడి పౌరస్మృతి కోసం పార్లమెంటులో చట్టం చేయాలని మాండమస్ జారీ చేయడం కుదరదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టంచేశారు. చట్ట సభలు రూపొందించిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ ను స్వీకరించేటప్పుడు తాము చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పర్యావరణం, విద్య వంటి అంశాలపై పిల్ దాఖలైతే దాన్ని స్వీకరించవచ్చని, ఇలాంటి అంశాలపై మాత్రం స్పష్టత కావాలన్నారు.
ఆ తర్వాత పిటిషనర్ ఉపాధ్యాయ్ తన పిటిషన్ సారాంశమైన రెండు పేజీల నోట్ చదివేందుకు అనుమతి కోరగా.. కోర్టును ప్రచారానికి వాడుకోవద్దని సూచించింది. అనంతరం కోర్టు రెండు ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వవలసిందిగా పిటిషనర్ ఉపాధ్యాయ్ను కోరింది. ఇందులో ఒకటి ఓ నిర్దిష్ట చట్టాన్ని తయారు చేయాలని సుప్రీంకోర్టు శాసనసభకు లేదా పార్లమెంటుకు ఎలా మాండమస్ను జారీ చేస్తుందని ప్రశ్నించారు. అలాగే వక్ఫ్ చట్టం వల్ల ఎలాంటి ప్రత్యేక ఉల్లంఘన కేసును చూపని పిటిషన్ను కోర్టు ఎందుకు స్వీకరించాలని అడిగారు. దీంతో తన పిటిషన్ ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ కోర్టు అనుమతి కోరారు. దీనికి కోర్టు అంగీకరించింది.