రఘురామకు సుప్రీం గుడ్ న్యూస్- అనర్హతపై ఆదేశాలు ఇవ్వలేం- పార్లమెంటే సుప్రీం
ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగుతున్న పొలిటికల్ వార్ లో అనర్హత వేటు వ్యవహారం ప్రధానంగా తెరపైకి వస్తోంది. పార్టీ వైఖరికి వ్యతిరేకంగా నిత్యం వ్యాఖ్యలు చేస్తుున్న రఘురామరాజుపై అనర్హత వేటు కోసం లోక్ సభ స్పీకర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఆయన స్పందించకపోవడంపై వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అనర్హత పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ చేసిన వ్యాఖ్యలు రఘురామరాజులో ఉత్సాహం నింపాయి.

రఘురామరాజుపై అనర్హత వేటు
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే అసమ్మతి యుద్ధం సాగిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఏం చేయాలో తెలియక సీఎం జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే రఘురామరాజుపై లోక్ సభ స్పీకర్ కు పలుమార్లు ఫిర్యాదు చేయించినా ఫలితం లేకపోవడంతో తాజాగా కేంద్రం వద్ద కూడా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అయినా రఘురామరాజుపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో వైసీపీలో అసహనం పెరుగుతోంది. దీంతో రఘురామరాజు కూడా మరింత చెలరేగి విమర్శలు చేస్తున్నారు. రఘురామరాజుపై అనర్హత విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు లేకపోవడం వైసీపీని ఇబ్బందుల్లోకి నెడుతోంది.

అనర్హతలపై సుప్రీంకోర్టు నిస్సహాయత
చట్టసభలకు ఎన్నికైన సభ్యుల అనర్హత కోసం దాఖలైన ఫిర్యాదులను పరిష్కరించే విషయంలో లోక్ సభతో పాటు చట్ట సభల స్పీకర్ల పాత్రపై ఇవాళ సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత వేటు కోసం కుప్పలు తెప్పలుగా దాఖలవుతున్న ఫిర్యాదులను స్పీకర్లు సకాలంలో పరిష్కరించకపోవడంపై దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మరోసారి అనర్హత పిటిషన్లపై క్లారిటీ ఇచ్చింది. అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకునే విషయంలో మన దేశంలో ప్రజాప్రాతినిధ్య చట్టం మాత్రమే ఉంది. అదీ స్పీకర్లకే సర్వాధికారాలు కట్టబెట్టింది. దీంతో ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ నిస్సహాయత వ్యక్తం చేసింది. అనర్హతలపై నిర్ణయం తీసుకునే అధికారం చట్ట సభల స్పీకర్లకే ఉందంటూ వ్యాఖ్యానించింది. దీంతో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు కాలపరిమితి పెట్టాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పశ్చిమబెంగాల్ పీసీసీ సభ్యుడికి చుక్కెదురైంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్లు కాల పరిమితితో నిర్ణయం తీసుకునేలా చేయాలంటే పార్లమెంటే చట్టం చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.

సుప్రీంతీర్పుతో రఘురామ సేఫ్
అనర్హత పిటిషన్ల విషయంలో కాల పరిమితిని తాము నిర్ణయించలేమంటూ సుప్రీంకోర్టు నిస్సహాయత వ్యక్తం చేయడంతో వైసీపీ నుంచి అనర్హత వేటు ముప్పు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణంరాజుకు భారీ ఊరట లభించినట్లయింది. ఇప్పటికే సొంత పార్టీ వైసీపీ లోక్ సభ స్పీకర్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రఘురామరాజుకు ఊరట లభించినట్లయింది. లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా రఘురామ విషయంలో వైసీపీ ఏమీ చేయలని పరిస్ధితి ఏర్పడింది. గతంలో తన పార్టీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించిన సమయంలోనూ అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పందించకపోవడంతో వైసీపీ ఇలాంటి పరిస్ధితే ఎదుర్కొంది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో వైసీపీ ఇరుకునపడింది.












Click it and Unblock the Notifications