కరోనా అనాధ పిల్లల దత్తతకు ఫేక్ కాల్స్- సుప్రీం సీరియస్-కఠిన చర్యలకు ఆదేశం
కరోనాతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చిన్నారులు అనాథలవుతున్నారు. వీరి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చిన కేంద్రం.. ఇవాళ మరో కీలక ఉత్తర్వు జారీ చేసింది. కరోనాతో్ అనాధలవుతున్న చిన్నారుల దత్తత కోసం వచ్చే ఫేక్ కాల్స్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.
కరోనాతో అనాధలవుతున్న చిన్నారుల సంరక్షణపై విచారణ జరుపుతున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వారి దత్తత విషయంలో ఇవాళ వివరాలు తీసుకుంది. అనంతరం 18 పేజీల తీర్పును వెలువరించిది. ఇందులో కోవిడ్తో అనాథలైన చిన్నారుల్ని దత్తత తీసుకుంటామంటూ వచ్చే వారిని ఆహ్వానించే వ్యక్తులు, స్వచ్ఛంద సంస్ధలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ని ఆదేశించింది.
కరోనాతో అనాథలైన చిన్నారుల్ని దత్త ఇస్తామంటూ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తున్న వారిని నిరోధించాలని, సదరు చిన్నారుల వివరాలు బయటికి రాకుండా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇలా ప్రటనలు ఇవ్వడం ద్వారా నిధులు సేకరిస్తున్న స్వచ్ఛంద సంస్ధలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
2015 నాటి జువైనల్ జస్టిస్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఎలాంటి దత్తతలు కూడా చెల్లుబాటు కావని కూడా తన ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ జోక్యం లేకుండా ఎలాంటి దత్తతలు అనుమతించవద్దని పేర్కొంది.