సుప్రీంకోర్టు కొత్త ప్రయోగం- ఈ నెల 15 నుంచి హైబ్రిడ్ విధానంలో కేసుల విచారణ
కరోనా నేపథ్యంలో భారత్లో వివిధ రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు అన్న తేడా లేకుండా అన్ని వ్యవస్ధలూ రూపురేఖలు మార్చుకుంటున్నాయి. ఇదే క్రమంలో భారత అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు కూడా కేసుల విచారణలో ప్రయోగాత్మకంగా వర్చువల్ విధానంలోకి వచ్చేసింది. అయితే కొన్ని కేసుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఇకపై భౌతికంగానూ, వర్చువల్ గానూ కలిపి కేసుల విచారణకు సిద్ధమవుతోంది.
మార్చి 15 నుంచి ప్రయోగాత్మకంగా హైబ్రిడ్ విధానంలో కేసుల విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. హైబ్రిడ్ విధానం అంటే భౌతికంగా, వర్చువల్ విధానంలో రెండూ అమల్లో ఉంటాయి. కోర్టు విచారణలో కొందరు భౌతికంగా, వీల్లేని వారు వర్చువల్గా కూడా హాజరయ్యేందుకు వీలు కల్పిస్తారు. వారంలో మూడు రోజుల పాటు మంగళ, బుధ, గురువారాల్లో ఇలా రెండు విధానాల్లోనూ కలిపి కేసుల విచారణ చేపడతారు. మిగతా రోజుల్లో వీడియో కాన్ఫరెన్స్ లేదా టెలికాన్ఫరెన్స్ విధానంలో విచారణలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ వెల్లడించారు.
ప్రస్తుతం తిరిగి ప్రభావం చూపుతున్న కరోనా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. పలు కేసుల విచారణ కోసం కక్షిదారులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుప్రీంకోర్టుకు రావడం, వారికి తగినంత విశాలంగా కోర్టు హాళ్లు లేకపోవడం వంటి సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని వారంలో మూడు రోజులు మాత్రమే హైబ్రిడ్ విధానంలో విచారణలు కొనసాగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కోర్టు హాలుకు ప్రత్యేక అనుమతి, ఆదేశాలు ఉంటే తప్ప కేవలం 20 మందిని మాత్రమే అనుమతించనున్నారు.