అలోక్ వర్మకు హైపవర్ కమిటీ షాక్, సీబీఐ డైరెక్టర్గా తొలగింపు, ఎక్కడకు బదలీ చేశారంటే?
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ అలోక్ వర్మకు షాక్ తగిలింది. ఆయన బాధ్యతలు చేపట్టిన రోజులోనే హైపవర్ కమిటీ గట్టి ఝలక్ ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్గా ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీవీసీ రిపోర్టులో ఆరోపణల వైపు హైపవర్ కమిటీ మొగ్గు చూపింది.
అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన మరుసటి రోజే హైపవర్ కమిటీ ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం సాయంత్రం ఈ కమిటీ భేటీ అయి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అలోక్ వర్మ పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది.
అలోక్ వర్మ బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లోనే సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైపవర్ కమిటీలో చర్చ జరిగింది. అలోక్ వర్మపై ఆరోపణలు నిజమేనని హైపవర్ కమిటీ నిర్ధారించింది. సీవీసీ ఆరోపణలపై అలోక్ వర్మను వివరణ కోరాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు. చర్యలు తీసుకునేముందు వివరణ అడగాలన్నారు. కానీ ఆయనను తప్పించాలని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. అలోక్ వర్మ తొలగింపును ఖర్గే వ్యతిరేకించారు. మరోవైపు, అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణల మీద దర్యాఫ్తు జరపాలని మరో హైపవర్ కమిటీ సభ్యులు జస్టిస్ సిక్రీ అభిప్రాయపడ్డారు.
మొత్తానికి ముగ్గురు సభ్యులు (ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత ఖర్గే, జస్టిస్ సిక్రీ) హైపవర్ కమిటీలో 2-1తో అలోక్ వర్మను తొలగించారు. సీబీఐ చీఫ్ పదవి నుంచి తొలగించిన ఆయనను ఫైర్ సర్వీసెస్ అండ్ హోంగార్డు విభాగానికి డైరెక్టర్ జనరల్గా బదలీ చేశారు.