రూ. 100 కోట్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు అవసరమే: అనిల్ దేశ్ముఖ్కు సుప్రీంకోర్టులో షాక్
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు సుప్రీంకోర్టులు చుక్కెదురైంది. రూ. 100 కోట్ల వసూళ్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ దేశ్ముఖ్, మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది.
ఉన్నతస్తాయిలో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు వచ్చినందున వాటిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమేనని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్ట్ తర్వాత అప్పటి ముంబై పోలీస్ కమిషనర్గా ఉన్న పరమ్ బీర్ సింగ్పై సర్కారు బదిలీ వేటు వేసింది.
ఈ నేపథ్యంలో పరమ్ బీర్ సింగ్.. అనిల్ దేశ్ముఖ్పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అనిల్ దేశ్ముఖ్ ప్రతి నెలా రూ. 100 కోట్ల వసూళ్లను వాజేకు లక్ష్యంగా పెట్టారంటూ సీఎం ఉద్ధవ్ థాక్రేకు పరమ్ బీర్ సింగ్ లేఖ రాశారు. తన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరపాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పరమ్ బీర్ తోపాటు మరో ఇద్దరు కూడా ఈ ఆరోపణలపై పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో విచారణ జరిపిన హైకోర్టు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దేశ్ముఖ్ పై వచ్చిన ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అనిల్ దేశ్ముఖ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనతోపాటు మహారాష్ట్ర సర్కారు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఆరోపణల తీవ్రత, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల హోదాను బట్టి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు అవసరమేనని కౌల్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది కేవలం ప్రాథమిక దర్యాప్తేనని, ఓ సీనియర్ మంత్రిపై సీనియర్ అధికారి తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు విచారణ జరిపితే తప్పేంటి? అని ప్రశ్నించింది. అంతేగాక, పరమ్ బీర్ సింగ్, అనిల్ దేశ్ముఖ్లు తమ పదవుల నుంచి తప్పుకునేవరకు కలిసి పనిచేసినవారే కదా? అని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత మాజీ మంత్రి దేశ్ముఖ్, మహారాష్ట్ర సర్కారు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్తివేసింది.