సీరం వ్యాక్సిన్ రెండు రోజులు ఆలస్యం- కేంద్రంతో కుదరని ఏకాభిప్రాయం ?
భారత్లో కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్ధల్లో ఒకటైన సీరం ఇన్స్టిట్యూట్ తాము తయారు చేసిన టీకాను కేంద్రానికి అందించే విషయంలో ఆలస్యం చేస్తోంది. వాస్తవానికి గురువారం రోజే భారీ ఎత్తున కోవిషీల్డ్ డోసులు పూణే నుంచి బయలుదేరాల్సి ఉండగా.. కేంద్రంతో జరుపుతున్న సంప్రదింపులు కొలిక్కి రాకపోవడం వల్ల ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
దేశవ్యాప్తంగా అత్యవసర వినియోగం కోసం పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ 50 మిలియన్ల డోసులను సిద్ధం చేసింది. వీటికి ఒక్కో డోసు రూ.200 రూపాయల చొప్పిన విక్రయించేందుకు సిద్ధమైంది. తొలి 100 మిలియన్ డోసుల వరకూ ఇదే ధరకు విక్రయిస్తామని కేంద్రానికి హామీ ఇచ్చింది. బహిరంగ మార్కెట్లో మాత్రం ఇదే డోసును వెయ్యి రూపాయల చొప్పున సీరం విక్రయించనుంది. అయితే ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని మరింత తక్కువ ధరకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని కేంద్రం కోరుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

వ్యాక్సిన్ ధరపై కేంద్రంతో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే సరఫరా ఆలస్యం అవుతున్నట్లు వస్తున్న వార్తలను సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా తోసిపుచ్చారు. ధర నిర్ణయంలో ఆలస్యం వల్ల వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం లేదన్న వార్తలను ఆయన ఖండించారు. కారణాలు ఏవైనా గురువారం సరఫరా చేయాల్సిన డోసులను సీరం ఇప్పటికీ రవాణా చేయకపోవడంతో అనుమానాలు నెలకొన్నాయి. ముందు గురువారం అని చెప్పిన సీరం వర్గాలు.. ఆ తర్వాత శుక్రవారానికి మార్చాయి. ఇప్పుడు మరో 48 గంటల్లో వ్యాక్సిన్ సరఫరా చేసే అవకాశముందని చెప్తున్నాయి. మరోవైపు భారీ ఎత్తున సరఫరా కావాల్సిన వ్యాక్సిన్ డోసుల కోసం పూణే ఎయిర్పోర్టు సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. రోజుకు 150 టన్నుల కార్గో రవాణాకు ఎయిర్పోర్టును సిద్ధం చేసినట్లు డైరెక్టర్ కుల్దీప్ సింగ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications