కేరళలో బీజేపీకి షాక్-రాజకీయాలకు మెట్రో మ్యాన్ శ్రీధరన్ గుడ్ బై-ఆసక్తి లేదని వెల్లడి
కేరళలో బీజేపీకి ఇవాళ మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో సవాళ్ల మధ్య బరిలోకి దిగి ఒక్క సీటు కూడా గెల్చులేకపోయిన బీజేపీకి ఇప్పుడు మెట్రో మ్యాన్ శ్రీధరన్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయాల నుంచి తప్పుకోవాలని శ్రీధరన్ నిర్ణయించుకున్నారు. దీనిపై ఇవాళ ఆయన ఓ ప్రకటన చేశారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్ధిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను బరిలోకి దింపింది. రాజకీయాల్లో అస్సలు అనుభవం లేని ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ ఎన్నికల ఫలితాలు భారీ షాక్ ఇచ్చాయి. కనీసం శ్రీధరన్ కూడా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలువలేకపోయారు. దీంతో బీజేపీలో నైరాశ్యం నెలకొంది. ఈ సమయంలో కేరళ బీజేపీలో కొనసాగుతున్న శ్రీధరన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు.
ఇకపై క్రియాశీల రాజకీయాలపై ఆసక్తి లేదని 'మెట్రో మ్యాన్'గా పేరొందిన 90 ఏళ్ల ఇ.శ్రీధరన్ పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్పై పోటీ చేసి ఆయన ఓడిపోయారు. నేను క్రియాశీల రాజకీయాల్లో ఉండను. ఆ సమయం గడిచిపోయింది. నేను (రాజకీయాలను) వదులుకోలేదు, కానీ ఇకపై చుట్టూ తిరగడంపై ఆసక్తి లేదు. నా వయసు 90 ఏళ్లు" అని ఆయన మీడియాతో అన్నారు. తాను ఎప్పుడూ రాజకీయ నాయకుడిని కాదని, బ్యూరోక్రాట్గా రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా మూడు ట్రస్టుల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు.
తన ఎన్నికల ఓటమి తర్వాత తాను "కొద్దిగా నిరాశ చెందినట్లు ఆయన ఒప్పుకున్నారు.. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఎలాంటి నిరాశ లేదు. ఎందుకంటే ఏకైక ఎమ్మెల్యేగా నేను ఏమీ చేయలేను. రాష్ట్రంలో అధికారం లేకుండా ఒక్క ఎమ్మెల్యే ఏమీ చేయలేడని శ్రీధరన్ అన్నారు. ఆయన పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్ చేతిలో ఓడిపోయారు.