సువేందుకు కలకత్తా హైకోర్టు షాక్- టీఎంసీకి భారీ ఊరట..!
పశ్చిమబెంగాల్లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు, టీఎంసీ ఓటమి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బీజేపీ నేతలు తృణమూల్ నేతల్ని, ప్రజాప్రతినిధుల్ని టార్గెట్ చేస్తూ కోడిగుడ్ల దాడులు చేస్తుండటమే. ఈ దాడులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఇవాళ భారీ ఊరట లభించింది. సువేందు సర్కార్ (Suvendu Govt) తీరుపై కలకత్తా హైకోర్టు మండిపడింది.
ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ నేతల్ని టార్గెట్ చేస్తూ జరిగిన ప్రతీ కోడిగుడ్ల దాడిపైనా నివేదిక ఇవ్వాలని సువేందు సర్కార్ ను కలకత్తా హైకోర్టు ఆదేశించింది. అలాగే ఆయా ఘటనలకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ల సంఖ్యను కూడా తమకు తెలియజేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు, గుడ్ల దాడి ఘటనలపై టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తరఫున న్యాయవాది డానిష్ ఫరూఖీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ తపబ్రత చక్రవర్తి, జస్టిస్ పార్థ సారథి ఛటర్జీలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.

ఇలాంటి ఘటనలను నివారించడానికి అన్ని పోలీస్ స్టేషన్ల కోసం నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించాలని ధర్మాసనం కోల్కతా పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. పోలీస్ కమిషనర్ వద్ద మార్గదర్శకాలు లేకపోతే, ఇలాంటి ఘటనలు కొనసాగుతాయని తెలిపింది. విచారణ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తాము అటువంటి చర్యలను ఆమోదించలేదని, ఫిర్యాదులు అందిన చోటల్లా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని కోర్టుకు తెలిపింది. రెండు వారాల సమయం ఇస్తే కోడిగుడ్ల దాడులపై పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను ప్రభుత్వం రికార్డులో ఉంచుతుందని హామీ ఇచ్చింది. దీంతో జూలై 20కు విచారణ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అప్పటిలోగా తాము కోరిన నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.














Click it and Unblock the Notifications