యోగీ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ-స్ధానిక ఎన్నికల నోటిఫికేషన్ కొట్టేసిన హైకోర్టు..
యూపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఇవాళ రద్దు చేసింది. ఈ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వాజ్యాల్ని విచారించిన లక్నోబెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
యూపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై యోగీ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా నోటిఫికేషన్ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ రద్దు చేసింది. అంతే కాకుండా ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ సౌరవ్ లావానియాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్ల కోసం డిసెంబర్ 5న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కూడా జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ సౌరవ్ లావానియాతో కూడిన డివిజన్ బెంచ్ రద్దు చేసింది.

సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను పాటించకుండా ఓబీసీ రిజర్వేషన్ ముసాయిదా తయారీని సవాల్ చేస్తూ దాఖలైన పిల్లపై విచారణ జరిపిన హైకోర్టు లక్నో బెంచ్.. ఈ తీర్పు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఫార్ములాను అనుసరించాలని, రిజర్వేషన్లను నిర్ణయించే ముందు ఓబీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా సర్వే నిర్వహించిందని, ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను అమలు చేయలేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో హైకోర్టు ఈ నోటిఫికేషన్ రద్దు చేసింది.












Click it and Unblock the Notifications