మణిపూర్ లో ఘోరం-కొండచరియలు విరిగి పడి 7గురు మృతి-45 మంది అదృశ్యం
మణిపూర్లోని నోనీ జిల్లాలో నిన్న రాత్రి భారీ కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు. నిన్న అర్ధరాత్రి సమయంలో కొండచరియలు విరిగిపడి, జిరిబామ్ నుండి ఇంఫాల్ వరకు నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ రక్షణ కోసం టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో మోహరించిన 107 టెరిటోరియల్ ఆర్మీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కంపెనీపై పడినట్లు అధికారులు తెలిపారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నిర్మాణంలో ఉన్న జిరిబామ్-ఇంఫాల్ కొత్త లైన్ ప్రాజెక్ట్ టుపుల్ స్టేషన్ భవనానికి ఈ ప్రమాదంతో నష్టం వాటిల్లిందని, ట్రాక్ నిర్మాణం, నిర్మాణ కార్మికుల శిబిరాలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఉత్తర సరిహద్దు రైల్వే అధికారులు తెలిపారు.
నోనీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ దీనిపై నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వారు వెల్లడించారు.ఇప్పటివరకు, 19 మందిని రక్షించారు. వీరికి నోనీ ఆర్మీ మెడికల్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైల్వే ట్రాక్ పనుల కోసం అక్కడ ఉన్న కార్మికులతో పాటు పలువురు స్ధానికులు కూడా ఈ ఘటనలో దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. ఇఫ్పటివరకూ రక్షించినవారు కాకుండా అదృశ్యమైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిధిలాల కింద వారు చిక్కుకుపోయిన్నట్లు తెలుస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగా వీరిని రక్షించడం ఎన్డీఆర్ఎఫ్ కు కూడా కష్టసాధ్యంగా మారుతోంది.