కొడుకును కిడ్నాప్ చేసి భార్యను చంపేశారు
ముంబై: భార్యను హత్య చేసి కుమారుడిని కిడ్నాప్ చెయ్యడంతో అతను కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఇద్దరు ఒకే సారి దూరం కావడంతో అతను షాక్ కు గురైనాడు. ముంబై నగరంలో ఈ దారుణం జరిగింది.
ముంబైలోని నల్లషోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబాల దేవ్ నాథ్ (27) నివాసం ఉంటున్నాడు. ఇతని భార్య గత్కి సింగ్ (25), దేవ్ నాథ్ కు ప్రకాష్ (7) అనే కుమారుడు ఉన్నాడు. భార్య, కుమారుడు అంటే దేవ్ నాథ్ కు ప్రాణం.
కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో గుర్తు తెలియనివ్యక్తులు దేవ్ నాథ్ కు ఫోన్ చేశారు. నీ కొడుకును కిడ్నాప్ చేశామని రూ. 1.50 లక్షలు ఇస్తే వదిలిపెడుతామని లేదంటే చంపేస్తామని బెదిరించారు.
పోలీసులకు చెబితే నీ కొడుకు శవం కూడ చిక్కదని హెచ్చరించారు. హడలిపోయిన దేవ్ నాథ్ కార్యాలయం నుండి ఇంటికి పరుగు తీశాడు. భార్య నగలు తాకట్టు పెట్టి కుమారుడిని రక్షించుకోవాలని అనుకున్నాడు. అయితే ఇంటికి వెళ్లి చూడగా అతని భార్య మంచం మీద పడి ఉన్న విషయం గుర్తించాడు.
భార్య గత్కి సింగ్ ను గొంతునులిమి హత్య చేశారని తెలుసుకుని కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దేవ్ నాథ్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రకాష్ ను కిడ్నాప్ చేసిన వారే గత్కి సింగ్ ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.