గాయనిపై లైంగిక దాడి ఆరోపణ: స్వామికి వైద్య పరీక్షలు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు రామచంద్రాపురం మఠానికి చెందిన రాఘవేశ్వర భారతి స్వామిపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. ఆయన 48 ఏళ్ల ఓ గాయనిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనకు విక్టోరియా ఆస్పత్రి ఆవరణలోని నిఫ్రో యురాలజీ సంస్థలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
స్వామి శుక్రవారం ఉదయమే ఏమీ తినకుండా సంస్థకు వచ్చారు. ఆయనకు రక్తంపోటు, హృదయ స్పందనలు, ఇసిజి, షుగర్ లెవెల్ వంటి పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం సాధారణ స్థితిలో ఉన్నట్లు తేలడంతో ఆయనకు అల్పాహారం ఇచ్చారు. ఆ తర్వాత ఇతర పరీక్షలు నిర్వహించారు. 16 పరీక్షలు నిర్వహించాలని దర్యాప్తు అధికారులు చెప్పారని, అయితే తాము 13 పరీక్షలు మాత్రమే నిర్వహించామని, ఇతర పరీక్షలకు స్వామి అంగీకరించలేదని, అందుకు ఆయనపై ఒత్తిడి పెట్టలేమని సంస్థ అధికారులు అంటున్నారు.

పరీక్షలకు సంబంధించిన నివేదికను 15 రోజుల్లోగా దర్యాప్తు అధికారులకు అందిస్తారు. వైద్య పరీక్షల విషయంలో సిఐడి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని స్వామి తరఫు న్యాయవాది శంబు శర్మ విమర్శించారు. హైకోర్టు ఆదేశాలు రావాల్సి ఉండగా, తొందర పడి స్వామిని వైద్యపరీక్షలకు హాజరు కావాలని ఆదేశించిందని, తాము వారం రోజుల సమయం అడిగితే సిడిఐ రెండు రోజులు మాత్రమే ఇచ్చిందని ఆయన అన్నారు.
తాము వైద్యులకు సహకరించామని, దర్యాప్తు అధికారులకు కూడా సహకరించామని మఠం ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇబ్బంది పెట్టే పరీక్షలేవీ స్వామికి నిర్వహించలేదని, తాను పురుషుడేనని అంటూ తనకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని స్వామి కోర్టుకూ పోలీసులకూ చెప్పారని, డిఎన్ఎ పరీక్షల కోసం రక్తం నమూనాలను మాత్రమే తీసుకున్నారని ఆ ప్రకటనలో వివరించారు.












Click it and Unblock the Notifications