Sharad Pawar : రాజీనామాపై శరద్ పవార్ యూటర్న్..!
మహారాష్ట్రలో రాజకీయ దిగ్గజంగా పేరొందిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్... అకస్మాత్తుగా తీసుకున్న రాజీనామా నిర్ణయంపై అంతే సడన్ గా వెనక్కి తగ్గారు. రెండు రోజుల క్రితం ఎన్సీపీ ఛీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన పవార్.. ఇవాళ దీనిపై వెనక్కి తగ్గాలని నిర్ణయించారు. ఎన్సీపీ ఛీఫ్ గా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు పవార్ ఇవాళ ప్రకటించారు. దీంతో ఈ రాజీనామా డ్రామాకు తెరపడినట్లయింది.
ఎన్సీపీ ఛీఫ్ గా రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత ఇవాళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా తిరిగి కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు శరద్ పవార్ వెల్లడించారు. మహారాష్ట్రలోని పార్టీ క్యాడర్ నుండి భావోద్వేగ నిరసనల నేపథ్యంలో తన రాజీనామాను పార్టీ అగ్రనేతలు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత పవార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 1999లో తాను స్థాపించిన పార్టీ అధినేతగా కొనసాగడం గురించి ఆలోచించేందుకు తనకు సమయం కావాలని 82 ఏళ్ల తన పార్టీ సహచరులకు చెప్పారు.

అన్నింటిపై పునరాలోచన చేసిన తర్వాత తాను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటిస్తున్నానంటూ పవార్ ప్రకటించారు. కాబట్టి తన మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానంటూ శరద్ పవార్ ఈ సాయంత్రం వెల్లడించారు. పవార్ రాజీనామా తర్వాత ఎన్సీపీతో పాటు మహారాష్ట్రలో ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్) పార్టీలు షాకయ్యాయి. దీని వెనుక ఉన్న కారణాల్ని ఆరా తీశాయి. కానీ వారికి క్లూ లభించలేదు.
శివసేనను చీల్చి బీజేపీతో జట్టు కట్టి సీఎం అయిన ఏక్ నాథ్ షిండే విషయంలో త్వరలో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వబోతోంది. దీంతో ఆయన పదవీచ్యుతుడు కావడం ఖాయమనే ప్రచారం మొదలైంది. దీంతో బీజేపీ ఈసారి ఎన్సీపీని చీల్చి పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ను సీఎం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీంతో బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా అజిత్ కు ఎన్సీపీ పగ్గాలు అప్పగించి తాను తప్పుకునేందుకు పవార్ ప్రయత్నించారనే వాదన వినిపించింది. చివరికి పవార్ వెనక్కి తగ్గడంతో సంక్షోభం సమసింది.












Click it and Unblock the Notifications