మోదీ కేరళలో అడుగు పెట్టిన వేళా విశేషం.. కాంగ్రెస్ కు శశిథరూర్ బిగ్ షాక్!!
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం లోక్ సభ సభ్యుడు శశి థరూర్ పార్టీ అధిష్ఠానానికి బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీ ఫిరాయించే అవకాశం ఉందంటూ అనుమానాలు వెల్లువెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన తీసుకుంటోన్న నిర్ణయాలు వీటిని మరింత బలోపేతం చేస్తోన్నాయి. మొన్నటి కేరళ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అత్యంత ప్రతిష్ఠాత్మక తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ను బీజేపీకి కోల్పోవడం దీనికి కేంద్రబిందువు అయింది.
ఢిల్లీలో పార్టీ అధిష్ఠానం సమావేశానికి శశిథరూర్ గైర్హాజరు కానున్నారు. రాష్ట్ర, కేంద్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై చర్చించడానికి ఏర్పాటు చేసిన ఈ భేటీకి ఆయన దూరంగా ఉండనున్నారు. అదే సమయంలో కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ప్రారంభమైంది. కొద్దిసేపటి కిందటే ఆయన తిరువనంతపురంలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయనకు స్వాగతం పలికారు.

ఈ పరిణామాల మధ్య ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్వహించదలిచిన సమావేశానికి శశి థరూర్ దూరం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనవరి 19న కొచ్చిలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహా పంచాయత్ జరిగింది. దీనిపై థరూర్ ఆగ్రహంతో ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగించిన ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు థరూర్ పట్ల పార్టీ ప్రోటోకాల్ పాటించలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సరైన స్థానం కేటాయించకుండా ఆయనను వేదిక చివరలో కూర్చోబెట్టారని చెబుతున్నాయి.
రాహుల్ గాంధీ మాత్రమే ఈ సమావేశంలో ప్రసంగిస్తారని, ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇతర నేతలకు లేదని థరూర్కు ముందే సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని దీనికి అనుగుణంగానే సిద్ధం చేసుకున్నారు. తరువాత ఇతర నాయకులు ఎక్కువసేపు మాట్లాడారు. ఇది ఆయన అసంతృప్తిని మరింత పెంచింది. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో పలువురు నేతలను ప్రస్తావించి, తన పేరును ప్రస్తావించకపోవడం ఆయనను కలచివేసిందనే ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా క్రమశిక్షణారాహిత్యాన్ని, అంతర్గత విషయాలను బహిరంగంగా చర్చించడాన్ని సహించేది లేదని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ భేటీకి రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పంజాబ్ ఇన్ఛార్జ్ భూపేష్ బఘేల్, సీనియర్ నాయకురాలు అంబికా సోనితో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications