డిమాండ్లకు నో చెబితే ఎన్డీయేకి గుడ్బై చెప్పేస్తాం: బాంబు పేల్చిన శివసేన
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు క్షణానికో మలుపు తీసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవిపై బీజేపీ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆ పార్టీతో కలిసి పయనించేదిలేదని శివసేన పార్టీ గట్టిగా పట్టుకుకూర్చుంది. బీజేపీ కూడా సీఎం పోస్టు తప్ప ఏమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు జాప్యం అయ్యేలా కనిపిస్తోంది. తాజాగా శివసేన మరో బాంబు పేల్చింది.
మహారాష్ట్ర సీఎంగా శివసేన అభ్యర్థే ఉంటారు: సంజయ్ రౌత్ షాకింగ్ స్టేట్మెంట్
ఎన్డీయేకు గుడ్బై చెప్పే యోచనలో శివసేన..?
మహారాష్ట్ర రాజకీయాలు ఓవైపు ఆసక్తికరంగా మారుతుండగానే మరోవైపు చాలా వేడి పుట్టిస్తున్నాయి. రెండు కాషాయ పార్టీలు ఒకే ఒరలో ఇమిడేలా లేవు. సీఎం పోస్టుపైనే రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఒక పార్టీ స్పష్టత కావాలని చెబుతుంటే మరోపార్టీ అది తప్ప ఇంకేమైనా ఇస్తాం అంటూ చెప్పుకొస్తోంది. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నీలిమేఘాలు అలుముకున్నాయి. తాజాగా తమ డిమాండ్కు ఒప్పుకోకపోతే ఎన్డీయేను వీడేందుకు శివసేన సిద్ధపడినట్లు సమాచారం. బీజేపీ తమ డిమాండ్కు అంగీకరిస్తే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని లేదంటే ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్రభుత్వ ఏర్పాటుపై ఇతర మార్గాలను అన్వేషిస్తామని శివసేన సీనియర్ నేత ఒకరు హాట్ కామెంట్స్ చేశారు.
అమిత్ షా హామీని నిలబెట్టుకోవాలి: శివసేన
2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా అమిత్ షా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని శివసేన చెబుతోంది. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది. పదవుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నప్పుడు అది సీఎం పోస్టుకు కూడా వర్తిస్తుందని అదే విషయం ఎన్నికలకు ముందు కూడా బీజేపీ అధ్యక్షుడు అమిత్షాతో కలిసిన సమయంలో చర్చించడం జరిగిందని శివసేన నేతలు గుర్తుచేస్తున్నారు.అయితే ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదని కమలనాథులు చెబుతున్నారు. కేవలం క్యాబినెట్ మంత్రి పదవులకు మాత్రమే ఫిఫ్టీ ఫిఫ్టీ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతోంది.
బాల్థాక్రే ఫార్ములానే పాటిస్తున్నాం: గడ్కరీ
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి పదవి చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న మాటను శివసేనతో బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని కేవలం మంత్రి పదవులపై మాత్రమే హామీ ఇవ్వడం జరిగిందని చెబుతున్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. అంతేకాదు శివసేన వ్యవస్థాపకులు బాల్థాక్రే అప్పట్లో ఓ ఫార్ములాను చెప్పారని గుర్తు చేశారు నితిన్ గడ్కరీ. ఏ పార్టీకి అయితే అత్యధిక సీట్లు వస్తాయో ఆ పార్టీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని నాడు బాల్థాక్రే సూచించారని గడ్కరీ చెప్పారు. 1995లో బీజేపీ శివసేనలు కలిసి పోటీచేయగా శివసేనకు అత్యధిక సీట్లు రావడంతో ఆ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని గడ్కరీ గుర్తుచేశారు. మరి ఆ ఫార్ములాకు శివసేన ఎందుకు కట్టుబడి ఉండటం లేదని గడ్కరీ ప్రశ్నించారు. 2019లో బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చాయి కాబట్టి బాల్థాక్రే ఫార్ములాను తాము అమలు చేస్తున్నట్లు చెప్పారు గడ్కరీ.
మొత్తానికి పరిస్థితి మరికొన్ని గంటలు ఇలానే కొనసాగితే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంది. లేదా ఎన్డీయే నుంచి బయటకు వస్తే ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని శివసేన చెబుతున్నప్పటకీ... ఎన్సీపీ మాత్రం తాము ప్రతిపక్షంలోనే ఉంటామని స్పష్టం చేసింది.