షాకింగ్: డార్క్ వెబ్ లో 70 లక్షల మంది భారతీయుల డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా ,5 లక్షల పాన్ నంబర్లు కూడా
భారతీయులకు షాకింగ్ అంశాన్ని వెల్లడించారు ఇంటర్నెట్ భద్రతా పరిశోధకులు . 70 లక్షల మంది భారతీయ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ హోల్డర్ల ఫోన్ నంబర్లు మరియు ఇమెయిల్ చిరునామాలతో సహా వ్యక్తిగత వివరాలు డార్క్ వెబ్లో ఉన్నాయని ఇంటర్నెట్ భద్రతా పరిశోధకులు హెచ్చరించారు. ఆన్లైన్లో 20 జిబి చాలా కాన్ఫిడెన్షియల్ డేటా హ్యాక్ చేయబడింది అని పేర్కొన్నారు . బహిర్గతమైన ఇతర వివరాలలో వినియోగదారుల పేర్లు, యజమాని సంస్థలు మరియు వార్షిక ఆదాయం కూడా ఉన్నాయి అని భద్రతా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
70 లక్షల మంది భారతీయ వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన అన్ని వివరాలు
ఇందులో లీకైన డేటాబేస్, 2GB పరిమాణంలో, 70 లక్షల మంది భారతీయ వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన అన్ని వివరాలను , వారి మొబైల్ హెచ్చరికలను ఆన్ చేశారా లేదా అనే విషయాన్ని కూడా వెల్లడిస్తుంది. డేటా 2010 మరియు 2019 మధ్య కాలానికి సంబంధించినదని , ఇది స్కామ్స్ చేసే వారికి , హ్యాకర్లకు చాలా విలువైన సమాచారం అని భద్రతా పరిశోధకులు ఒక ప్రకటనలో ఐఏ ఎన్ ఎస్ కు చెప్పారు.
లీక్ అయిన డేటా బేస్ లో ఐదు లక్షల మంది పాన్ డేటా కూడా
ఇది ఫైనాన్షియల్ డేటా కాబట్టి, ఫిషింగ్ లేదా ఇతర దాడుల కోసం ఉపయోగించే అవకాశం ఉందని అంటున్నారు . ఈ లీక్ అయిన క్రెడిట్ , డెబిట్ కార్డుల డేటా బ్యాంకులచే ఒప్పందం కుదుర్చుకున్న మూడవ పార్టీ సర్వీసు ప్రొవైడర్లు అయిన కంపెనీల నుండి వచ్చి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు . లీకైన డేటాబేస్ లో ఐదు లక్షల మంది కార్డుదారులకు పాన్ నంబర్లు కూడా ఉన్నాయని ఇంటర్నెట్ భద్రతా పరిశోధకులు తెలిపారు.
ఫైనాన్షియల్ డేటా ఇంటర్నెట్లో అత్యంత ఖరీదైన డేటా
70 లక్షల మంది వినియోగదారుల డేటా వాస్తవమైనదా కాదా అని ధృవీకరించబడనప్పటికీ, కొంతమంది వినియోగదారుల డేటాను ధృవీకరించింది మరియు అనేక రంగాలలో ఉన్న చాలామందికి సంబంధించిన వివరాలు ఖచ్చితమైనవిగా గుర్తించబడ్డాయి. ఎవరో ఈ డేటాకు సంబంధించిన లింక్ను డార్క్ వెబ్లో అమ్మారని, తరువాత అది పబ్లిక్గా మారిందని అనుకుంటున్నట్టు వెల్లడించారు . ఫైనాన్షియల్ డేటా ఇంటర్నెట్లో అత్యంత ఖరీదైన డేటా, అని అన్నారు.
సైబర్ నేరగాళ్ళు రేచ్చిపోకముందే అలెర్ట్ అంటున్న ఇంటర్నెట్ సెక్యూరిటీ వింగ్
కరోనా మహమ్మారి మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు సైబర్ సెక్యూరిటీ సంఘటనలు నిరంతర సమస్యగా ఉన్న సమయంలో ఈ విషయం వెల్లడి కావటం ఆందోళన కలిగిస్తుంది. ఈ డేటా లీక్ కారణంగా బ్యాంక్ ఎకౌంట్స్ , డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు . వినియోగదారులు సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోకముందే పాస్ వర్డ్స్ , పిన్ నంబర్లు మార్చుకోవాలని సూచిస్తున్నారు .