కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఓటముల కంటే విజయాలే ఎక్కువ!!
కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం విషయంలో చోటు చేసుకున్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. కర్ణాటక కాంగ్రెస్ లో గెలుపొందిన ఎమ్మెల్యేల మద్దతుతో, అనేక చర్చల అనంతరం సిద్ధరామయ్య పేరు సీఎంగా ఖరారైంది. సాధారణ రైతు కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చిన సిద్ధరామయ్య తన 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అనేక పదవులను అధిరోహించి సీఎం గానూ తన మార్క్ చూపించారు.
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య రాజకీయ చతురత కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానం చూస్తే మొదట ఒక సామాన్య రైతు కుటుంబం నుండి కాంగ్రెస్ వ్యతిరేఖ భావాలతో రాజకీయాల్లో అడుగుపెట్టారు సిద్ధరామయ్య. మొదట స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన జనతాదళ్, జనతాదళ్ సెక్యులర్ పార్టీలలో పనిచేశారు. తర్వాత 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ లో కీలక నేతగా ఆయన ఎదిగారు.

మొత్తం తన రాజకీయ ప్రస్థానంలో 9 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. మూడు సార్లు మంత్రిగా, ఒక్కసారి ముఖ్యమంత్రిగా పని చేశారు సిద్ధరామయ్య. మొత్తం తన రాజకీయ ప్రయాణంలో ఆయన మూడు సార్లు ఓటమి పాలయ్యారు.ఆయన హిస్టరీలో ఓటముల కంటే విజయాలే ఎక్కువ. 2013 నుండి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు నిర్వహించారు.
అప్పటివరకు అంతకు ముందు 40 ఏళ్ళలో 5 సంవత్సరాలు పూర్తి స్తాయి ముఖ్యమంత్రిగా పాలన సాగించిన నాయకుడు కర్ణాటకలో లేరు. 1983 లో చాముండేశ్వరీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో జనతాదళ్ నుండి పోటీ చేసి చాముండేశ్వరీ నియోజకవర్గంలో పోటీ చేసి మళ్ళీ గెలిచారు. అప్పుడు ఆయనకు మంత్రి పదవి వరించింది.
ఆ తర్వాత 1989లో తొలిసారి ఓటమి పాలైన ఆయన, 1994లో మళ్ళీ విజయం సాధించి మంత్రి అయ్యారు. ఆపై 1996లో సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పదవి వరించింది. 1999లో ఆయన మంత్రిపదవి కోల్పోయారు. ఆపై ఆయన జనతాదళ్ కు గుడ్ బై చెప్పి జనతాదళ్ యునైటెడ్ లో చేరారు. 1999ఎన్నికల్లో జనతాదళ్ యునైటెడ్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
మళ్ళీ 2004లో ఆయన జనతాదళ్ యునైటెడ్ నుండి పోటీ చేసి గెలిచారు. 2005లో జనతాదళ్ యునైటెడ్ నుండి సిద్ధరామయ్య బహిష్కరణకు గురయయారు. ఆపై ఆయన 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరి చాముండేశ్వరి నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో గెలిచారు. ఆపై 2008, 2013 ఎన్నికల్లో నియోజకవర్గం మార్చుకుని వరుణ నుండి పోటీ చేసి గెలిచారు.
ఆపై సీఎంగా 2013 నుండి 2018 వరకు పని చేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2018లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ కూటమి లోని ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యటంతో వచ్చిన ఉప ఎన్నికలలో మొత్తం 12 స్థానాలు గెలుస్తామని గెలుపు బాధ్యత తీసుకున్నారు సిద్ధరామయ్య.

అప్పుడు కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. దీంతో సిద్ధరామయ్యపై సొంతపార్టీలో అసమ్మతి పెరిగింది.దీంతో సీఎల్పీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగటంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సిద్ధరామయ్యకు మళ్ళీ సీఎంగా పట్టం కడుతుంది కాంగ్రెస్ పార్టీ.












Click it and Unblock the Notifications