సీఎంగా చన్నీ ప్రకటన - సీనియర్లు సీరియస్ : సిద్దు మద్దతుదారుల ఆందోళన..!!
ఈ సారి ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ను కాంగ్రెస్ నేత రాహుల్ తమ పార్టీ సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు. ఇప్పటి వరకు సీఎం పదవి ఆశిస్తున్న సిద్దూకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో ఒక్క సారిగా ఎన్నికల ముందు కాంగ్రెస్ లోని సీనియర్లు... సిద్దూ మద్దతు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దూ అభిమానులు నిరసనలకు దిగి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

చన్నీ ప్రకటనలో కొత్త సమస్యలు
పంజాబ్ లోని పార్టీ సీనియర్లతో మంతనాల తరువాతనే కాంగ్రెస్ అధినాయకత్వం చన్నీ వైపు మొగ్గు చూపింది. కొద్ది రోజుల ముందే సీఎం చన్నీ మేనల్లుడు భూపేందర్ సింగ్ హనీని, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది ఈడీ. అయినప్పటికీ చన్నీపైనే కాంగ్రెస్ అధిష్ఠానం నమ్మకముంచింది. ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా చన్నీకి సీఎం పదవి కట్టబెట్టింది. ఇప్పుడు ఎన్నికల్లో గెలిస్తే..తిరిగి చన్నీ సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేసింది. దీనిని సిద్దూ మద్దతు దారులు జీర్ణించుకోవటం లేదు.

సిద్దూ మద్దతు దారుల ఆందోళన
పంజాబ్ పీసీసీ చీఫ్ గా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ అసెంబ్లీ నియోజకవర్గమైన అమృత్సర్ ఈస్ట్లో ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీపై వ్యతిరేకత కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలే ముఖ్యమంత్రి చన్నీని ఓడించాలంటూ ప్రచారం చేస్తున్నారు. చన్నీని వ్యతిరేకిస్తున్న సిద్ధూ మద్దతుదారులు నిరసన తెలిపారు. అకాలీ దళ్ ముఖ్యనేత బిక్రమ్ సింగ్ మజిథియాపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అమృత్సర్ ఈస్ట్లో ఎన్నికల ప్రచార సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల పైన పీసీసీ ప్రధాన కార్యదర్శి స్పందించారు. సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉందనే ప్రచారాన్ని ఖండించారు.
Recommended Video

గెలుపు పై కాంగ్రెస్ - ఆప్ ధీమా
కాంగ్రెస్ ఐక్యంగా ఉందని, పార్టీ గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తమ శక్తియుక్తులను అందజేస్తామని, రాహుల్ గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సిద్ధూ ఇప్పటికే ప్రకటించారన్నారు. ఆప్ సైతం ఇక్కడ విజయం పైన ధీమాగా ఉంది. తమ పార్టీ గ్రాఫ్ అంచనాల కంటే బాగా పెరిగిందంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ మాత్రం తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ లో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న అంతర్గత పరిణామాలు నష్టం చేస్తాయనే వాదన ఒక వైపు వినిపిస్తుండగా.. మరో వైపు చన్నీని ముందుగా ప్రకటించటం వ్యూహంలో భాగంగా మరో చర్చ మొదలైంది. ఈ నెల 20వ తేదీన పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల సమరం జరగనుంది.












Click it and Unblock the Notifications