సోషల్ మీడియాలో సిక్కుల పేర్లతో సిక్కులపైనే దుష్ప్రచారం... నకిలీ నెట్వర్క్ గుట్టు రట్టు
తమను సిక్కులుగా చెప్పుకుంటూనే విభజన వాదం అజెండాను ముందుకు తీసుకు వెళ్లిన నకిలీ సోషల్ మీడియా అకౌంట్ల ఒక నెట్వర్క్ గుట్టు బయటపడింది.
సీఐఆర్(సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రెసిలియెన్స్) బుధవారం ప్రచురించనున్న ఈ రిపోర్టును బీబీసీతో పంచుకుంది. నకిలీ అకౌంట్లుగా తేలడంతో రద్దైన 80 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించామని ఆ నివేదికలో చెప్పారు.
తమ ప్రచారంలో భాగంగా హిందూ జాతీయవాదాన్ని, భారత ప్రభుత్వ వాదనను ప్రోత్సహించడానికి ఈ నెట్వర్క్ ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఉపయోగించింది.
"సిక్కుల స్వేచ్చ, మానవహక్కులు, వారి విలువలు లాంటి కీలక అంశాలపై ఉన్న దృక్కోణాన్ని మార్చడమే ఈ నెట్వర్క్ లక్ష్యం" అని ఈ రిపోర్ట్ రచయిత బెంజమిన్ స్ట్రిక్కు అనిపించింది.
ఈ రిపోర్టుపై భారత ప్రభుత్వం వివరణను తెలుసుకోడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా లభించలేదు.
నకిలీ అకౌంట్ల వెనుక అసలు వ్యక్తులు
ఈ నెట్వర్క్ 'సాక్ పపెట్' అకౌంట్స్ ఉపయోగించింది. అంటే నకిలీ సోషల్ మీడియా ఖాతాలు. కానీ, వీటిని నిజం వ్యక్తుల ద్వారానే ఉపయోగిస్తారు. ఇవి ఆటోమేటెడ్ బోట్స్లా ఉండవు.
ఈ నకిలీ అకౌంట్లను సిక్కుల పేర్లతో ఉపయోగించారు. 'రియల్ సిక్' అంటే అసలుసిసలు సిక్కులు అని చెప్పుకున్నారు.
తమ ఎజెండాను బలంగా ముందుకు తీసుకెళ్లడానికి వారు #RealSikh హాష్ట్యాగ్ ఉపయోగిస్తూ కనిపించారు. తమకు భిన్నంగా ఉన్న రాజకీయ వైఖరిని బలహీనపరచడానికి #FakeSikh అనే హాష్ట్యాగ్ ఉపయోగించారు.
ఈ నెట్వర్క్ వేరు వేరు ప్లాట్ఫాంలలో ఒకే నకిలీ ప్రొఫైల్ను ఉపయోగించినట్లు లాభాపేక్ష రహిత సంస్థ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రెసిలెన్స్(సీఐఆర్) నివేదికలో వెలుగులోకి వచ్చింది.
వేరు వేరు ప్లాట్ఫాంలలో ఉన్న ఈ అకౌంట్లలో పేర్లు, ప్రొఫైల్ పిక్చర్, కవర్ ఫొటోలు కూడా ఒకేలా ఉన్నాయి. అంతే కాదు ఈ ప్రొఫైళ్లలో ఒకేలా కనిపించే పోస్టులు కూడా చేశారు.
వీటిలో చాలా అకౌంట్లకు సెలబ్రిటీల ఫొటోలు ఉపయోగించారు. వాటిలో ఎక్కువగా పంజాబీ సినీనటుల ఫొటోలు ఉన్నాయి. కానీ, ఒక సోషల్ మీడియా అకౌంట్లో సెలబ్రిటీ ఫొటోను ఉపయోగించడం వల్ల అది నకిలీ అని నిరూపించలేం.
కానీ, వరుస సందేశాలు, మాటి మాటికీ ఉపయోగించిన హాష్ట్యాగ్లు, ఒకేలా కనిపించే బయోగ్రఫీ వివరణలు, వారిని ఫాలో అయ్యేవారి పాటర్న్, ఫొటోలు అన్నీ చూస్తే ఈ అకౌంట్లు నకిలీవిగా చెబుతున్న ఆధారాలను మరింత బలం చేకూరుతోందని ఆ నివేదిక పేర్కొన్నారు.
ఈ అకౌంట్ల ప్రొఫైల్ కోసం ఉపయోగించిన ప్రముఖుల ఫొటోల్లో ఉన్న 8 మంది సెలబ్రిటీలను బీబీసీ సంప్రదించింది.
"తన ఫొటోను ఇలా ఉపయోగిస్తున్న విషయం తనకు తెలీదంటూ" వారిలో ఒక సెలబ్రిటీ తన మేనేజర్ ద్వారా బీబీసీకి సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేయిస్తామని తెలిపారు.
మరో సెలబ్రిటీకి సంబంధించిన మేనేజ్మెంట్ టీమ్ తమ క్లైంట్ ఫొటోను కొన్ని వేల నకిలీ ఖాతాల్లో ఉపయోగించినట్లు చెప్పింది. దానిపై తాము ఇప్పుడు ఏం చేయలేమని తెలిపింది.
- 1984 సిక్కుల ఊచకోత, 2002 గుజరాత్ మారణకాండ: న్యాయం కోసం ఎదురుచూపులు
- 1897 సారాగఢీ యుద్ధం: ఒక భారతీయ సైనికుడి విగ్రహాన్ని బ్రిటన్లో ఎందుకు పెట్టారు?
రాజకీయ ఉద్దేశాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
భారత్లో వివిధ ప్రాంతాల్లో రైతు సంఘాలు గత ఏడాది నుంచీ ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి.
ఈ నెట్వర్క్ దశాబ్దాల పురాతన ఖలిస్తాన్ ఉద్యమం, ఏడాది క్రితం మొదలైన రైతు ఉద్యమాలను కూడా టార్గెట్ చేసుకుంది.
స్వేచ్ఛకు సంబంధించి సిక్కుల ప్రతి ఆలోచనకూ ఈ నకిలీ అకౌంట్ల ద్వారా తీవ్రవాదం రంగు పులిమారని ఈ నివేదిక చెప్పింది. రైతు ఉద్యమాన్ని కూడా చట్టవిరుద్ధంగా ప్రకటించే ప్రయత్నాలు జరిగాయని, రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఖలిస్తాన్ తీవ్రవాదులు హైజాక్ చేశారన్నారని పేర్కొంది.
కానీ, ఇంతకు ముందు కొందరు కేంద్ర మంత్రులు కూడా రైతుల ఉద్యమంలో ఖలిస్తానీలు చేరారని వ్యాఖ్యలు చేశారు.
బ్రిటన్, కెనెడాలో నివసించే భారతీయులు ఖలిస్తాన్ ఉద్యమానికి ఆశ్రయం ఇస్తున్నారని కొన్ని అకౌంట్లలో చెప్పారు.
ఈ అకౌంట్లకు వేలాది ఫాలోయర్లు ఉన్నారు. ఈ నెట్వర్క్ పోస్టులను నిజమైన సోషల్ మీడియా యూజర్లతో లైక్, రీట్వీట్ చేయిస్తున్నారు. దానితోపాటూ న్యూస్ వెబ్సైట్లలో కూడా ఈ ట్వీట్లకు చోటు లభిస్తోంది.
- ఆ ఫోన్ కాల్తో నెహ్రూ సంతోషమంతా ఆవిరైపోయింది
- పాకిస్తాన్కు రూ.55 కోట్లు ఇవ్వాలన్న డిమాండే మహాత్మా గాంధీ హత్యకు కారణమా?
ఎంత ప్రభావం ఉంది
సాధారణంగా నకిలీ అకౌంట్ల సాయంతో ప్రభావం చూపడానికి నిర్వహించే ఇలాంటి ఎన్నో ప్రచారాల్లో నిజమైన యూజర్లతో కమ్యూనికేషన్ ఏర్పరుచుకోవడంలో విఫలం అవుతారు.
కానీ, ఈ నెట్వర్క్కు సంబంధించిన ఎన్నో పోస్టులను కొందరు పబ్లిక్ ఫిగర్స్ సమర్థించినట్లు రీసెర్చ్ సమయంలో వెలుగులోకి వచ్చింది.
న్యూస్ బ్లాగ్స్, వ్యాఖ్యలు చేసే వెబ్సైట్లకు సంబంధించిన నకిలీ ఖాతాల కంటెంట్ను కూడా ఇదే రిపోర్టులో గుర్తించారు.
ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్ అంశాల నిపుణులు దీనిని 'ఆంపిలిఫికేషన్' అంటే ప్రభావాన్ని పెంచే వ్యూహంగా భావిస్తున్నారు. ఎందుకంటే, నెట్వర్క్లో ఎంత కంటెంట్ అందుబాటులో ఉంటే, వారు అంత ఎక్కువగా ప్రభావం చూపించవచ్చు.
ఈ నెట్వర్క్కు సంబంధించిన పోస్టులపై కామెంట్స్ చేసిన కొన్ని వెరిఫైడ్ ఖాతాలు ఉన్న వారిని బీబీసీ సంప్రదించింది.
రూబుల్ నేగీ ట్విటర్లో తనను మానవహక్కులు, సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటున్నారు. ఒక నకిలీ ఖాతా ట్వీట్కు స్పందనగా ఆమె చప్పట్లు కొడుతున్న ఏమోజీని పోస్ట్ చేశారు.
"అది ఒక నకిలీ అకౌంట్ అని తెలిసి, బాధపడ్డాను" అని ఆమె చెప్పారు.
తనను భౌగోళిక, రాజకీయ, మిలిటరీ విశ్లేషకుడుగా చెప్పుకునే రోహిత్ దేవ్ కూడా ఒక నకిలీ అకౌంట్ పోస్టుకు థంబ్స్ అప్ ఎమోజీతో స్పందించారు.
కానీ, "ఆ హ్యాండిల్ వెనుక ఎవరున్నారో నాకు తెలీదు" అని ఆయన బీబీసీకి చెప్పారు.
"ఈ ఇన్ఫ్లుయెన్స్ నెట్వర్కులు ఒక ప్రత్యేక దృక్కోణం ఉన్న వారిని తమ లక్ష్యంగా చేసుకుంటాయి" అని నిఖిల్ పాహ్వా చెప్పారు.
డిజిటల్ హక్కుల గురించి వాదించే, టెక్నాలజీ రంగానికి సంబంధించిన విధానాలపై దృష్టి పెట్టే మీడియానామాకు నిఖిల్ పాహ్వా ఎడిటర్గా ఉన్నారు.
"80 అకౌంట్లకు ఒక అంశాన్ని ట్రెండ్ చేసేంత సామర్థ్యం ఉండదు. కానీ, వరుసగా పోస్టులు చేస్తూ ఉండడం వల్ల అవి ఒక దృక్కోణానికి హాని తలపెట్టే ప్రయత్నం చేస్తాయి. ఇది ఒక పెద్ద ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న ఒక అధునాతన విధానంలా అనిపిస్తోంది" అని ఆయన అన్నారు.
ఈ నెట్వర్క్ ద్వారా సిద్ధం చేసిన కంటెంట్ ఎక్కువగా ఇంగ్లిష్లో ఉంది. భారత్లో సిక్కులు సాధారణంగా మాట్లాడుకునే పంజాబీ భాషలో చాలా తక్కువగా ఉంది.
"రైతు ఉద్యమం సమయంలో అన్ని వైపుల నుంచి రాజకీయ కార్యకలాపాలు కొనసాగాయి. అందులో కొందరు రైతుల ఉద్యమానికి మద్దతిస్తే, మరికొంతమంది దానిని నీరుగార్చే ప్రయత్నం చేశారు" అంటారు పాహ్వా.
"రాజకీయ చర్చల్లో గెలవాలనే లక్ష్యంతో సాగిన గేమ్లో ఇదంతా భాగం" అన్నారు.
బీబీసీ ఈ రిపోర్టును ట్విటర్తోపాటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నిర్వహించే మెటా కంపెనీతో కూడా షేర్ చేసుకుంది. దీనిపై వారి వివరణను కోరింది.
తమ ప్లాట్ఫాంను దుర్వినియోగం చేస్తున్నారని భావించిన ట్విటర్ ఈ అకౌంట్లను రద్దు చేసింది.
"కొంతమంది చాలా అకౌంట్లను ఉపయోగించడం, తమ ప్లాట్ఫాం దుర్వినియోగానికి సంబంధించిన వ్యూహాల గురించి మా దగ్గర ఎలాంటి ఆధారాలూ లేవు" అని ట్విటర్ ప్రతినిధి చెప్పారు.
తమ ప్రామాణిక విధానాలు ఉల్లంఘించినందుకు మెటా కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఈ అకౌంట్లను తొలగించింది.
"ఆ అకౌంట్లతో తమ గురించి, తమ కంటెంట్ పాపులారిటీ గురించి ప్రజలను తప్పుదారి పట్టించారు. ఫేక్ అకౌంట్ ఉపయోగించి ప్రజలను స్పామ్ చేశారు. మా పట్టు నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించారు" అని మెటా ప్రతినిధి అన్నారు.
ఇది ఉద్దేశపూర్వక రాజకీయ ఎత్తుగడ కావచ్చని వ్యవసాయ చట్టాలపై నిరసనలు కొనసాగిస్తున్న రైతులు భావిస్తున్నారు.
"ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, నిరసనలకు వ్యతిరేకంగా కథనాలు రూపొందించడానికే ఈ అకౌంట్లు సృష్టించారని మేం భావిస్తున్నాం" అని భారతీయ కిసాన్ యూనియన్ నేత జగ్జిత్ సింగ్ దలేవాల్ అన్నారు.
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన 30కి పైగా రైతు సంఘాల్లో భారతీయ కిసాన్ యూనియన్ ఒకటి.
ఇవి కూడా చదవండి:
- ఒత్తిడి తట్టుకోవడానికి గంజాయిని ఆశ్రయిస్తున్న అమ్మలు, ఇది ఆరోగ్యానికి ప్రమాదం కాదా
- ఘాతక్ డ్రోన్ : పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే ముప్పును ఇది తప్పిస్తుందా
- ''మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు ఓ పెద్ద ఎత్తుగడ.. ఇదీ తెరవెనుక కథ’’
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- కడప జిల్లాలో వరదలు: 'మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
- 'ఆన్లైన్ చదువులకు లక్షల్లో ఫీజులు కట్టాం... ఏమీ అర్థం కాలేదని చెబితే ఏమంటారో’
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్స్టర్' ఎలా అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)