కల నెరవేరింది.. ఇక నిశ్చితంగా కన్నుమూస్తానన్న సీఎం
కోల్ కతా : సింగూరు భూములకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. 'ఇక నిశ్చితంగా కన్నుమూయవచ్చు' అన్న వ్యాఖ్యలు చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సుప్రీం కోర్టు తీర్పు అనేది నా చిరకాల కల అంటూ భావోద్వేగానికి గురైన మమతా.. తన కల సాకారమైనందుకు ఇక నిశ్చితంగా చనిపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు.
సుప్రీం తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన మమతా.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు కోసమే పదేళ్లుగా తనతో పాటు సింగూరు ప్రజలు నిరీక్షిస్తూ వచ్చారని చెప్పారు మమతా. తాజా తీర్పును రైతుల విజయంగా పేర్కొంటూ ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పుతో సింగూరులో జరిగే ఉత్సవాన్ని ప్రతీ ఒక్కరు దుర్గమాత ఉత్సవాన్ని తలపించేలా జరుపుకుంటారని తెలిపారు మమతా.
ఇక కేసు విషయానికొస్తే.. 2006లో అప్పటి వామపక్ష ప్రభుత్వం నానో కార్ల ప్లాంట్ కోసం టాటా మోటార్ కు సింగూరులో 997 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా.. మమతా నేతృత్వంలో అక్కడి ప్రజలు పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లకు తమ పోరాట కల నెరవేరడంతో మమతా ఈవిధంగా స్పందించారు.