సీబీఎస్ఈ టాపర్ అత్యాచార ఘటన: తొలి అరెస్టు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్
కొన్ని రోజుల క్రితం హర్యాణాలో సీబీఎస్ఈ టాపర్ అయిన అమ్మాయిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. చదువుల సరస్వతిపై కొందరు కామాంధులు కాటేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తొలి అరెస్టు చేశారు. గతకొన్ని రోజులుగా నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. అయితే పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని కనీనాకు చెందిన దీన్దయాల్గా గుర్తించారు. అత్యాచారం జరిగాక... అమ్మాయిని దీన్దయాల్ బస్టాండు సెంటర్లో వదిలేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఆయన ట్యూబ్వెల్ షాపు ఓనరని చెప్పారు. మరోముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
చదువుల సరస్వతిపై కామాంధుల కాటు
ముగ్గురు నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. నిందితుల్లో ఒకరు జవాను కూడా ఉన్నాడు. వీరికి సంబంధించిన సమాచారం అందిస్తే లక్ష రూపాయలు బహుమానం ప్రకటించారు. నిందితుల్లో ఒకరైన జవాను పేరు పంకజ్ అని చెప్పిన పోలీసులు రాజస్థాన్లో ఆయన పోస్టింగ్ అని వివరించారు. మిగతా ఇద్దరు మనీష్, నిషులుగా పోలీసులు గుర్తించారు. సెప్టెంబర్ 12న కోచింగ్ క్లాసులు ముగించుకుని రేవారి గ్రామంకు తిరిగి వస్తుండగా అమ్మాయిని కిడ్నాప్ చేసి జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురు నిందితులు అత్యాచారం చేశారు.
సీబీఎస్ఈ నిర్వహించిన బోర్డు పరీక్షలో బాధిత యువతి టాపర్గా నిలిచింది. ఆ చదువుల సరస్వతి ప్రధాని మోడీ అభినందించారని తల్లిదండ్రులు చెప్పారు. మోడీ భేటీ పడావో భేటీ బచావో అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. కానీ మృగాళ్లు ఉన్న ఈ సమాజంలో అది ఎలా సాధ్యమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురుకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు.