ఇక నుంచి ప్యాసెంజర్ వాహనాల్లో కూడా 6 ఎయిర్ బ్యాగులు: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
ప్యాసింజర్ల వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 8 మంది లోపు ప్రయాణికులను తరలించే అన్ని వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముసాయిదా GSR నోటిఫికేషన్ పై సంతకం చేశారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా వివరాలు వెల్లడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.
2019 జులై 1 నుంచి అన్ని వాణిజ్య వాహనాల్లో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయగా.. 2022 జనవరి 1 నుంచి ప్యాసింజర్ వైపు కూడా ఎయిర్ బ్యాగ్ ఉండాలని కేంద్రం ఆదేశించింది. M1 వాహనం విభాగంలో మరో 4 అదనపు ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి చేయాలని నిర్ణయించడంతో తదుపరి ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో మోటారు వాహనాలను గతంలో కంటే సురక్షితంగా చేయడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాల్లో ముందు కూర్చున్న ఇద్దరు ప్రయాణికులతోపాటు, వెనుక కూర్చున్న ప్రయాణికుల రక్షణ నిమిత్తం ఈ ఆరు ఎయిర్ బ్యాగులు ఉపయోగపడుతాయని ఆయన అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవం 2022లో భాగంగా జనవరి 11 నుంచి 18 వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత వంటి అంశాలపై అధికారులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. దేశంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తోన్న జాతీయ రహదారులు నెత్తురోడుతున్నాయి.