మహా రాజకీయంలో మరో ట్విస్ట్-6గురు ఎన్సీపీ ఎమ్మెల్యేల మిస్సింగ్-అజిత్, శరద్ పవార్లకు దూరంగా..
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీని చీల్చి ఎన్డీయే సర్కార్ లో చేరి డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ తో పాటు సీఎం ఏక్ నాథ్ షిండేకు సైతం ఇప్పుడు మనశ్శాంతి లేకుండా పోతోంది. దీనికి కారణం వీరిద్దరి వెంట నడిచిన ఎమ్మెల్యేల్లో వీరిపై నమ్మకం సడలిపోతుండటమే. గతంలో శివసేనను చీల్చి బీజేపీతో కలిసి సీఎం అయిన షిండేకు ఇప్పుడు అజిత్ పవార్ ఫిరాయింపు సమస్యగా మారింది. అదే సమయంలో మరో ట్విస్ట్ ఎదురైంది.
ఎన్సీపీ నుంచి చీలిక తర్వాత అజిత్ పవార్ వెంట మెజార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ-శివసేన ప్రభుత్వానికి అండగా నిలిచారు. అయితే అజిత్ పవార్ చీల్చిన ఎమ్మెల్యేల సంఖ్య ఆయన్ను ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి కాపాడేలా కనిపించడం లేదు. దీనికి కారణం ఎన్సీపీ చీలికను గుర్తించేందుకు అవసరమైన సంఖ్యా బలం కంటే ఐదుగురు ఎమ్మెల్యేలు తక్కువగా ఉండటమే. ఎన్సీపీకి ఉన్న 53 మంది ఎమ్మెల్యేల్లో చీలిక వర్గంగా గుర్తింపు పొందాలంటే 36 మంది అవసరం. కానీ అజిత్ క్యాంపులో కేవలం 31 మందే ఉన్నారు.

అలాగే శరద్ పవార్ క్యాంపుతో పాటు అజిత్ పవార్ క్యాంపుల్లోనూ లేకుండా ఓ అరుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో దియోలాలీ ఎస్సీ ఎమ్మెల్యే సరోజ్ అహిరే, వాస్మత్ ఎమ్మెల్యే చంద్రకాంత్, జున్నార్ ఎమ్మెల్యే అతుల్ బెనాకే, షహాపూర్ ఎస్టీ ఎమ్మెల్యే దౌలత్ దరోడా, కోపర్ గావ్ ఎమ్మెల్యే అశుతోష్ కాలే, అనుశక్తినగర్ ఎమ్మెల్యే నవాబ్ మాలిక్ ఉన్నారు. వీరంతా ఎన్సీపీ సంక్షోభం తర్వాత కనిపించకుండా పోయారు.
అయితే వీరిని మీడియా సంప్రదిస్తే తమకు శరద్ పవార్, అజిత్ పవార్ ఇద్దరూ ముఖ్యమేనని కొందరు, స్ధానిక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నామంటూ మరికొందరు తెలిపారు. ఇంకొందరు ఎవరికీ అందుబాటులో లేరు. దీంతో ఈ ఆరుగురు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాల్సిన అవసరం అజిత్ పవార్ కు ఉంది. ఇందులో ఆయన విఫలమైతే మాత్రం ఫిరాయింపు చట్టం కింద తనవైపు ఇప్పటికే వచ్చిన ఎమ్మెల్యేలతో పాటు వేటును ఎదుర్కోవాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications