ఎకనామిక్ స్లోడౌన్: గణేష్ మండపాలకు స్పాన్సర్ల కొరత, ముంబైలో పరిస్థితి ఇలా!
Recommended Video
ముంబై: ఆర్థిక మందగమనం వినాయక మండళ్ల(మండపాలు)పై పడింది. పెద్ద పెద్ద వినాయక మండళ్లపై ఈ ఆర్థిక మందగమనం ప్రభావం చూపకపోయినప్పటికీ.. చిన్న స్థాయి మండళ్లపై ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆర్థిక మందగమనం కారణంగా సుమారు 25శాతం చిన్న వినాయక మండళ్లకు దాతలుస్పాన్సర్స్) కరువయ్యారు.

పెద్ద మండపాలకు ఓకే..
ముంబైలో మొత్తం 13వేల సర్వజనిక్ మండళ్లు ఉన్నాయి. ఇక 3,070 పెద్ద మండళ్లు ఉన్నాయి. రద్దీ, ప్రాంతాన్ని బట్టి మండళ్లను నాలుగు రకాలుగా విభజించారు. అడ్వర్టైజింగ్ రేట్లను వీటి ఆధారంగానే నిర్ణయిస్తారు. ఎక్కువ రద్దీ ఉండే పెద్ద మండళ్ల వద్ద ఒక్కో గేట్ వద్ద ఏర్పాటు చేసే ప్రకటనకు రూ. లక్ష కంటే ఎక్కువ రేటు ఉంటుంది

లాల్బాగ్ మండపానికీ తగ్గిన ప్రకటనలు
ముంబైలో ప్రముఖులు ఎక్కువగా సందర్శించే లాల్బాగ్ మండపానికి సుమారు రూ. 10లక్షల వరకు డబ్బు ప్రకటనల రూపంలో వస్తుంది. ఈ ఏడాది మాత్రం 7-8 లక్షలకు తగ్గిందని వందేళ్లు పూర్తి చేసుకున్న చిన్చ్పోక్లిచా చింతామణి అధికార ప్రతినిధి సందీప్ పరాబ్ తెలిపారు.

స్పాన్సర్లు ముందుకు రావడం లేదు
అంధేరీచా రాజా కోశాధికారి సుబోధ్ చిట్నీస్ మాట్లాడుతూ.. పెద్ద మండళ్లకు వచ్చే మొత్తం దాదాపు సమానంగానే ఉన్నాయి. స్పాన్సర్షిప్ కోసం ఇవి వివిధ కంపెనీలను సంప్రదిస్తుంటాయి. ఇంతకుముందు ఐదు గేట్లకు స్పాన్సర్ షిప్ చేసే కంపెనీలు ఇప్పుడు 2 లేదా 3 గేట్లకే స్పాన్సర్ చేస్తున్నాయి. దీంతో ఎక్కువ కంపెనీలను సంప్రదించాల్సి వస్తోందని సుబోధ్ వివరించారు.

25శాతం తగ్గిన ప్రకటనలు
బృహన్ముంబై సర్వజనిక్ గణేశోత్సవ్ సమన్వయ సమితి(బీఎస్జీఎస్ఎస్), గణపతి మండళ్ల అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు నరేష్ దహిభవకర్ మాట్లాడుతూ.. మండపాలకు వచ్చే ప్రకటనలు సుమారు 25శాతం తగ్గిపోయిందని అన్నారు. తాము పెద్ద మండపాలను నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రకటనలు రాలేదు. బిల్డర్లు ఈ ఏడాది ప్రకటనలు ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదని, ఇక చిన్న మండపాల పరిస్థితి మరీ దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు.

సంపన్న మండపాల పరిస్థితి ఇలా..
ముంబై నగరంలోనే సంపన్న మండలపాలైన గౌడ్ సారస్వత్ బ్రాహ్మిణ్(జీఎస్బీ) సేవా మండల్, కింగ్స్ సర్కిల్ మండపాలకు 80శాతం డబ్బు పూజ రసీదులు, సాధారణ విరాళాలు, హుండీ ద్వారానే వస్తుందని జీఎస్బీ, కింగ్స్ సర్కిల్ మండపాల ట్రస్టీ సతీష్ నాయక్ తెలిపారు. రూ. 2016లో 8.15కోట్ల వరకు డబ్బు వచ్చిందని తెలిపారు. గత సంవత్సరం 66,000 పూజలు నిర్వహించామని, ఈ ఏడాది మరో 6వేల పూజలు పెరగవచ్చని అన్నారు.
ప్రకటనల ద్వారా కేవలం 20శాతం మాత్రమే వస్తుందని తెలిపారు.

ఖర్చులు తగ్గించుకుంటున్న మండళ్లు..
కుర్ల సర్వోదయ మండల్ సభ్యుడు వసంత్ ముల్లిక్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రకటనలు రాకపోవడంతో సభ్యత్వాన్ని రూ.2వేలు చేశామని చెప్పారు. ఇతర భక్తులు తమకు నచ్చిన వస్తువులను దేవుడి వద్ద ఉంచగలరు. వినాయక నవరాత్రులకు సుమారు రూ. 2లక్షలు వరకు ఖర్చవుతుందని, మిగితా మొత్తాన్ని వరద బాధితులకు అందిస్తామని చెప్పారు. లైటింగ్, డెకోరేషన్ ఖర్చును తగ్గించి, రూ.1.5లక్షల్లోనే వినాయక పండగను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రకటనలు రాకపోవడంతో మండళ్లు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. కాగా, సాధారణంగా టెలికాం, ఎఫ్ఎంసీజీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు మండళ్ల వద్ద ప్రకటనలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి.












Click it and Unblock the Notifications