సురేంద్రది రాజకీయ ప్రతీకార హత్యే : ముగ్గురి అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు
లక్నో : స్మృతి ఇరానీ అనుచరుడు సురేంద్ర సింగ్ హత్య కేసులో పోలీసులు సంచలన నిజాలు బహిర్గతం చేశారు. సురేంద్ర హత్య రాజకీయ వైరంతో జరిగిందేనని స్పష్టంచేశారు. హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు.
పరారీలో మరో ఇద్దరు
హత్య కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని యూపీ డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్ పేర్కొన్నారు. వారిని తర్వలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సురేంద్ర హత్య కేసులో వీరి ఐదుగురు ప్రమేయం ఉందని .. స్థానికంగా పార్టీ పరంగా విరోధాలే హత్యకు దారితీశాయని అనుమానం వ్యక్తం చేశారు. సురేంద్ర సింగ్ సోదరుడు నరేంద్ర సింగ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఐదుగురిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని ఆయన వివరించారు.
కాల్పుల కలకలం ..
ఈ నెల 25 అర్ధరాత్రి తన ఇంటి వరండ వద్ద సురేంద్ర సింగ్ నిద్రిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతోపాటు అల్లుళ్లు అభయ్, అనురాగ్ కూడా పడుకున్నారని తెలిపారు. కాసేపటికే తుపాకీ పేలిన శబ్ధం వినిపించిందని వివరించారు. వెంటనే లేచి చూసేసరికి వసీం, అతని సోదరుడు నజీమ్, గోలు పరుగెత్తుతున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. రోడ్డు అతల రామచంద్ర ఉన్నారని .. రామచంద్ర పంచాయతీ పెద్ద ధర్మనాత్ గుప్తా బంధువు అని తెలిపారు.
మీరు జాగ్రత్త ..
సురేంద్ర సింగ్ హత్య జరిగిన వెంటనే స్మృతి ఇరానీ తన పనులన్నీ పక్కనపెట్టి అమేథీ వచ్చారు. సింగ్ కుటుంబసభ్యులను దగ్గరుండి ఓదార్చారు. తన అనుచరుడి అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు స్మృతి. పాడే మోసి తన అనుచరుడిపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీలో తాను గెలువడంతో తట్టుకోలేక దాడులు చేస్తున్నారని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇకనైనా బీజేపీ కార్యకర్తలు జాగ్రత్తగా మలుచుకోవాలని పేర్కొన్నారు. అమేథీ అంటే ప్రేమే తప్ప ద్వేషం కాదని .. అది మరోసారి నిరూపించారని తెలిపారు.