లంచం అడిగారనీ.. పాములను వదిలాడు(వీడియో)
లక్నో: లంచం కోసం వేధింపులకు గురిచేసిన అధికారులపై ఎలాగైన కసి తీర్చుకోవాలకున్న ఆ వ్యక్తి.. పదుల సంఖ్యలో పాములను తెచ్చి ఆ ప్రభుత్వ కార్యాలయంలో వేశాడు. దీంతో ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురైన అధికారులు కుర్చీలు, టేబుళ్లు ఎక్కి కేకలు పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ప్రభుత్వ అధికారులు లంచంతో వేధించడంతో ఇద్దరు రైతులు ఈ పనికి పూనుకున్నారు. మూడు సంచుల్లో తెచ్చిన 40పాములను ప్రభుత్వ పన్నుల శాఖ కార్యాలయంలో వదిలేశారు. అందులో విషపూరితమైన కోబ్రా పాములు కూడా ఉన్నాయని పాములు వేసిన హకుల్ తెలిపాడు.
కాగా, హర్రయ్య పట్టణానికి చెందిన లాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అధికారి సుభాష్ మణి తెలిపిన వివరాల ప్రకారం.. హకుల్ తన పాములను ఉంచడం కోసం ఓ ప్లాట్ కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇలాంటి వ్యాపారం కోసం ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని అధికారి తెలిపారు.
తన వ్యాపారం కోసం ప్లాట్ కేటాయించని కారణంగానే హకుల్ భారీ మొత్తంలో పాములు తెచ్చి వేశాడని తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది కుర్చీలు, బెంచీలు ఎక్కి తమ ప్రాణాలను రక్షించుకున్నారని చెప్పారు.
కాగా, అనంతరం హకుల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను పాములను ఉంచేందుకు తనకు ప్లాట్ కేటాయించాలని రెండేళ్ల క్రితం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పాడు. చాలా కాలం నుంచి వేచి చూస్తున్నానని.. పని జరగకపోవడంతో పాములను వదలక తప్పలేదని తెలిపాడు.
తనకు అదనపు స్థలం కేటాయించాలని పాములను ఆడించే హకుల్ రాష్ట్రపతికి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం అతనికి కావాల్సిన స్థలానికి సంబంధించిన వ్యవహారాలను చూడాలని కింది అధికారులకు ఆదేశాలు చేసింది. తనకు స్థలం కేటాయించాలనే కోరితే.. రెవెన్యూ అధికారులు లంచం అడుగారని హకుల్ తెలిపాడు.
ఎన్నిసార్లు వెళ్లినా లంచం ముట్టందే పని జరగదని చెప్పినట్లు తెలిపాడు. దీంతో విసుగుచెందిన తన వద్ద ఉన్న పాములను కార్యాలయంలో వదిలేశానని హకుల్ చెప్పారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, కొందరు అతని చర్యను సమర్థిస్తుండగా, మరికొందరు సరైన పద్ధతి కాదని అంటున్నారు.