గుజరాత్ పోరులో 'సన్ రైజ్'- వారసులకు టికెట్లివ్వడంలో బీజేపీ, కాంగ్రెస్ పోటా పోటీ !
వచ్చేనెల 1, 5 తేదీల్లో రెండు దఫాలుగా జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని అధికార బీజేపీ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పాతికేళ్ల తర్వాత గెలుపు రుచి చూడాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతీ సీటు, అందులో పోటీ చేసే అభ్యర్ధీ కీలకంగా మారిపోతున్నారు.
దేశంలో కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల్ని ప్రతీ సందర్భంలోనూ తప్పుబట్టే బీజేపీ గుజరాత్ లో మాత్రం వారసులకు టికెట్లు కేటాయించడంలో మాత్రం ముందుంది. అదే సమయంలో బీజేపీకి పోటీగా కాంగ్రెస్ కూడా ఎప్పటిలాగే వారసులకు టికెట్లు ఇస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ దాదాపు 10 స్ధానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులకు టికెట్లు కేటాయించారు. దీంతో ఈసారి గుజరాత్ ఎన్నికల్లో 20 మంది వారసులు రంగంలోకి దిగుతున్నట్లవుతోంది. అయితే ఈ వారసులు పార్టీల గెలుపోటములు నిర్ణయిస్తారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 సీట్లకు ఇరుపార్టీలు అభ్యర్ధుల్ని ప్రకటించాయి. ఇందులో కాంగ్రెస్ అత్యధికంగా 13 సీట్లలో వారసులకు టికెట్లు కేటాయించింది. అదే సమయంలో అధికార బీజేపీ కూడా ఏడు సీట్లలో వారసులకు టికెట్లు ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న పలు చోట్ల ఆయా అభ్యర్ధులకు బదులు వారి వారసులకు టికెట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు సీనియర్ నేతలు తమకు బదులుగా వారసులకు టికెట్లు తెచ్చుకుంటున్నారు. దీంతో గుజరాత్ పోరులో వారసత్వ రాజకీయాల హవా కొనసాగుతోంది.