మెమెన్ భార్యకు రాజ్యసభ: ఎస్పీ నేత సస్పెండ్, ఫైర్
ముంబై/లక్నో: 1993 ముంబై పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమెన్ విషయంలో సమాజ్ వాది పార్టీ మహారాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ఫరూక్ ఘోసి చేసిన డిమాండ్ ఎదురు తిరిగింది! ఆయనను సమాజ్ వాది పార్టీ పార్టీ నుంచి బహిష్కరించింది.
యాకూబ్ మెమెన్ ఉరి నేపథ్యంలో ఆయన భార్య రహీన్ మెమెన్కు అనేక ఇబ్బందులు ఉన్న దృష్ట్యా పార్టీ తరపున ఆమెకు రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించాలని శనివారం ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్కు ఆయన ఫరూక్ ఘోసి లేఖ రాశారు.
దనిపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. రహీన్ నిస్సహాయ స్థితిలో ఉన్నారని, చాలా ఏళ్లు ఆమె జైల్లో గడిపారని, అలాంటి ముస్లీంలను ఆదుకోవడానికి మనం పోరాడాలని, ఆమె ఉగ్రవాది భార్య కాని ఉగ్రవాది కాదని పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా అలాంటి వారి వాణిని వినిపించే అవకాశం ఆమెకు కల్పించాలన్నారు. మనసులో మాటనే తాను బయట పెట్టానని, పార్టీ తన పైన చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చునని ఆయన చెప్పారు.
దీనిపై బిజెపి, శివసేన, కాంగ్రెస్ పార్టీలు భగ్గుమన్నాయి. వ్యూహాత్మక, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యాకూబ్ మెమెన్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ అతడిని ఉరి నుంచి రక్షించేందుకు ప్రయత్నించిన వారు జాతి వ్యతిరేకులను బిజెపి ఎంపి సాక్షి మహరాజ్ మండిపడ్డారు.
1993 నాటి పేలుళ్లలో వారి బంధువులు ఉండి ఉంటే వారు అంత్యక్రియల్లో పాల్గొనక పోయేవారన్నారు. యాకూబ్ మెమెన్ అంత్యక్రియల్లో అతని కుటుంబ సభ్యులు, బంధువులు తప్ప పాల్గొన్న మిగతా వారి పైన దృష్టి పెట్టాలన్నారు.