జయలలిత అప్పీళ్ల విచారణకు ప్రత్యేక కోర్టు: హైకోర్టు
బెంగుళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడియంకె అధినేత జయలలిత అప్పీళ్లను విచారించడానికి కర్నాటక హైకోర్టు శుక్రవారం ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసింది. జస్టిస్ కుమారస్వామి నేతృత్వంలోని స్పెషల్ బెంచ్ ఆ కేసులన్నీంటిని విచారిస్తుంది.
అక్రమాస్తుల కేసులో తనను నేరస్థురాలిగా నిర్ధారించడాన్ని వ్యతిరేకిస్తూ జయలలిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేకాకుండా రోజువారి విచారణ జరిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.అక్రమాస్తుల కేసులో జయలలిత నేరస్థురాలేనని ప్రత్యేక కోర్టు నిర్ధారించిన తర్వాత ఆమెకు 2014 అక్టోబర్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
జయలలిత అప్పీళ్లపై విచారణను 2015 మార్చిలోగా ముగించాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు కర్నాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ జయలలిత అప్పీళ్ల విచారణ కోసం ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేశారు. అప్పీళ్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. జస్టిస్ కుమారస్వామి ఆ అప్పీళ్లపై జనవరి 9 నుంచి విచారణ జరపనున్నారు.