తగ్గని కరోనా ఉధృతి: కేరళలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైట్కర్ఫ్యూ
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో సగం కేసులకంటే ఎక్కువ కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం కరోనా కట్టడికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం(ఆగస్టు 30 ) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. నైట్ కర్ఫ్యూను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి పూట అమలు చేస్తామని ఆయన తెలిపారు.

కాగా, శనివారంనాడు కూడా కేరళలో కొత్త కేసులు 30 వేల మార్కును దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 1,67,497 నమూనాలను పరీక్షించగా.. 31,265 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 153 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 39.77లక్షలకు చేరింది. తాజా మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 20,466కి పెరిగింది.
శుక్రవారంతో పోలిస్తే (19.22 శాతం) పాటిజిటివిటీ రేటు కాస్త తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 18.67 శాతంంగా ఉంది. శనివారం కరోనా సోకినవారిలో 96 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37.51 లక్షల మంది కోలుకోవడంతో ప్రస్తుతం రాష్ట్రంలో 2,04,896 యాక్టివ్ కేసులున్నాయి. త్రిస్సూర్ జిల్లాలో అత్యధికంగా 3957 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళంలో 3807, కోయ్కోడ్లో 3292 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇది ఇలా ఉండగా దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ.. కేరళలో అత్యధిక కేసులు నమోదవుతుండటంతో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. తాజాగా భారతదేశంలో రోజువారీ కోవిడ్ సంఖ్యలు నాలుగు శాతానికి పైగా పెరిగాయి . దేశంలో శనివారం 46,759 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 509 మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తాజాగా 17,61,110 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లుగా గణాంకాలు వెల్లడించాయి. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు ముందు రోజుతో పోలిస్తే 4.7 శాతం మేర అధికంగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3.25 కోట్ల మందికి కరోనా మహమ్మారి కేసులు నమోదు కాగా, 4,37,370 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంోల ప్రస్తుతం క్రియాశీల కేసులో రేటు 1.10శాతానికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 3,59,775 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి బారి నుంచి 31,374 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3. 18 కోట్లకు చేరుకుంది. ఇక రికవరీ రేటు 97.56 శాతంగా ఉంది.












Click it and Unblock the Notifications