జయ మరణం, షీలా బాలకృష్ణన్ రాజీనామా మిస్టరీనే, ఏంటీ కథ: స్టాలిన్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం అన్ని విషయాలను రహస్యంగా పెట్టాలని చూస్తుందని, ఇక్కడి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నదని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ శనివారం మండిపడ్డారు.
స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిందని ఆరోపించారు. జయలలిత అందించిన చికిత్స వివరాలు, ఆమె ఎలా మరణించారు అనే విషయాలు ప్రజలకు వివరించడంలో తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని స్టాలిన్ ఆరోపించారు.
జయలలిత మరణం మిస్టరీగానే ఉన్న సమయంలోనే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చి ప్రజలను అయోమయానికి గురిచేసిందని అన్నారు. జయలలితకు నమ్మకస్తురాలైన షీలా బాలకృష్ణన్ ఎందుకు రాజీనామా చేశారు అని ఆయన ప్రశ్నించారు.

అసలు షీలా బాలకృష్ణన్ రాజీనామా చేశారా ? లేక కావాలనే ఆమెను పదవి నుంచి తప్పించారా ? అనే విషయం మిస్టరీగా ఉందని, ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడిగా తాను డిమాండ్ చేస్తున్నానని స్టాలిన్ అన్నారు.
తమిళనాడు సీఎంగా శశికళ పగ్గాలు చేపట్టడానికి రంగం సిద్దం అవుతున్న సమయంలో ఆరాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ప్రభుత్వం మీద విరుచుకుపడటంతో అన్నాడీఎంకే పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు. గతంలో కూడా స్టాలిన్ జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ప్రభుత్వం అసలు విషయాలు ప్రజలకు చెప్పాలని పలు సార్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications