స్టాన్ స్వామి: 'ఆయనది మరణం కాదు.. కస్టోడియల్ డెత్', వెల్లువెత్తుతున్న విమర్శలు
మానవ హక్కుల ఉద్యమకారుడు ఫాదర్ స్టాన్ స్వామి మృతిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొందరు స్వామి మృతిని విషాదంగా పేర్కొంటే.. మరికొందరు దీన్ని హత్య అంటున్నారు. ఇంకొందరు ఇది ''కస్టోడియల్ డెత్’’ అని ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నారు.
84 ఏళ్ల స్వామి ముంబయి ఆసుపత్రిలో రెండు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి సోమవారం మరణించారు.
భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి గత ఏడాది రాంచీలో స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అల్లర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు.
ఆయనకు నక్సలైట్లతో సంబంధాలున్నాయని పోలీసులు అభియోగాలు మోపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో...
స్వామిపై ఉగ్రవాద ఆరోపణలతో తప్పుడు కేసు బనాయించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సీనియర్ ప్రతినిధి మేరీ లాలర్ వ్యాఖ్యానించారు.
''మేం స్టాన్ స్వామి అంశాన్ని ఇదివరకే భారతీయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. తప్పుడు ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మానవ హక్కుల ఉద్యమకారుల్ని ఇలా చేయడం క్షమించరాని నేరం’’ అని ఆమె ట్వీట్ చేశారు.
https://twitter.com/MaryLawlorhrds/status/1411991009614049292
''ఆదివాసీ హక్కుల కోసం స్టాన్ స్వామి ఎంతగానో కృషిచేశారు. ఆయన్ను తొమ్మిది నెలల నుంచి కస్టడీలోనే ఉంచారు. ఆయన్ను విడిచిపెట్టాలని మేం చాలాసార్లు భారత అధికారులకు సూచించాం’’ అంటూ ఐరోపా సమాఖ్యలో మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధి ఎమన్ గిల్మోర్ ట్వీట్ చేశారు.
https://twitter.com/EamonGilmore/status/1412007358432264197
న్యాయం జరగాలి..
''ఆయనకు న్యాయం జరగాలి. ఆయనపై మానవత్వం చూపించి ఉండాల్సింది’’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.
https://twitter.com/RahulGandhi/status/1411985467155922944
మరోవైపు ఇది మరణం కాదు హత్య అంటూ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు.
''దీనికి బాధ్యులు ఎవరో మనకు బాగా తెలుసు’’ అని ఆయన ట్వీట్ చేశారు.
https://twitter.com/YashwantSinha/status/1411980376466071558
''పేద గిరిజనుల కోసం, మానవ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఓ ఉద్యమకారుడికి న్యాయం దక్కలేదు. మరణించే సమయంలోనూ ఆయనకు మానవ హక్కులు లభించలేదు’’ అని కాంగెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు.
https://twitter.com/priyankagandhi/status/1412010294977597443
స్వామి మరణాన్ని ''జ్యుడీషియల్ డెత్’’గా చరిత్రకారుడు రామచంద్ర గుహ చెప్పారు.
''అణగారిన వర్గాల కోసం ఆయన కృషి చేశారు. ఆయనది సహజ మరణం కాదు.. జ్యుడీషియల్ డెత్. దీనికి కేంద్ర హోం శాఖ, కోర్టులదే బాధ్యత’’ అని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు.
https://twitter.com/Ram_Guha/status/1411994697535344647
- భీమా కోరేగావ్ కేసు ఎక్కడిదాక వచ్చింది?
- భీమా కోరేగావ్: హింసాత్మక ఘర్షణలు జరిగి మూడేళ్లు.. ఇప్పటి వరకూ ఈ కేసులో ఏం జరిగింది?
''స్ట్రా అడిగినా ఇవ్వలేదు’’
స్టాన్ స్వామిని అదుపులోకి తీసుకున్న అనంతరం, మహారాష్ట్రలోని తలోజా జైలుకు తరలించారు. అనారోగ్యం వల్ల మంచి నీళ్లు గ్లాసుతో తాగలేకపోతున్నానని.. తనకు స్ట్రా, సిప్పర్ ఇప్పించాలని గత ఏడాది స్వామి కోరారు. అయితే, దీనికి అనుమతించొద్దని కోర్టుకు ఎన్ఐఏ సూచించింది.
స్టాన్ స్వామి పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడేవారు. నరాల సంబంధిత సమస్యల వల్ల ఆయన చేతులు వణికేవి. ఆయన సరిగా నిలబడలేకపోయేవారు. అందుకే మంచి నీళ్ల గ్లాసుపై ఆయనకు పట్టు ఉండేది కాదు.
పార్కిన్సన్స్ వ్యాధి తర్వాత, స్వామి రెండు చెవులూ దెబ్బతిన్నాయి. చాలాసార్లు జైలులో ఆయన కింద పడిపోయారు. ఆయనకు పొత్తి కడుపులో నొప్పి వచ్చేది. దీంతో ఆయన్ను జైలుకు సంబంధించిన ఆసుపత్రికి తరలించారు.
ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబయిలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గుండె పోటుతో ఆయన మరణించారు.
''బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’
స్టాన్ స్వామి మరణ వార్త తనను కలచివేసిందని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు.
''అక్టోబరు 2020 నుంచి స్టాన్ స్వామిపై కనీసం మానవత్వం కూడా చూపలేదు. ఎలాంటి అభియోగాలు మోపకుండానే అరాచకమైన యూఏపీఏ చట్టం కింద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కస్టోడియల్ డెత్కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు.
https://twitter.com/SitaramYechury/status/1411993737887031299
''ప్రభుత్వం చేతిలో అమానుష, క్రూరమైన హింసను అనుభవించి... కస్టడీలోనే ఆయన కన్నుమూశారు. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న కరుణా నంది వ్యాఖ్యానించారు.
''84ఏళ్ల స్వామిని యూఏపీఏ చట్టం కింద ప్రభుత్వం అరెస్టు చేసింది. జీవితాంతం గిరిజనుల అభివృద్ధి కోసం వారితో కలిసి పనిచేసినందుకేనా ఆయనపై ఉగ్రవాది అనే ముద్ర వేశారు’’ అని సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ ప్రశ్నించారు.
https://twitter.com/sardesairajdeep/status/1411980228067397639
''ఫాదర్ స్టాన్ స్వామి ఎప్పటికీ మరణించరు. మా గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఫాసిస్టు మోదీ ప్రభుత్వంపై పోరాడి ఆయన ప్రాణాలను అర్పించారు. మోదీ-షాల చేతికి స్టాన్ స్వామి రక్తం అంటుకుంది. ఈ ఇద్దరినీ ప్రజలు ఎప్పటికీ క్షమించరు’’ అని గుజరాత్ వడగామ్కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని వ్యాఖ్యానించారు.
https://twitter.com/jigneshmevani80/status/1411981284721631233
మరోవైపు కొందరు నెటిజన్లు, స్టాన్ స్వామిని, ఆయనకు మద్ధతుగా ట్వీట్లు చేస్తున్న వారిని అర్బన్ నక్సల్స్ అంటూ ఆరోపించారు.
https://twitter.com/vivekagnihotri/status/1412064884984999936
భారత్ పేరు ప్రతిష్టలను దెబ్బ తీసేందుకు కావాలనే కొందరు ఇలాంటి ఘటనలను అవకాశంగా తీసుకుంటున్నారని నేషనల్ అవార్డు గ్రహీత, బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు.
''ఈ రోజు చాలా విచారకరమైన రోజు. ఎందుకంటే భారత దేశ శత్రువులను పోరాట యోధులుగా కొనియాడుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు. ఎందుకంటే భారత్ను అస్థిర పరచడమే వారి లక్ష్యం. దీన్నే అర్బన్ నక్సలిజం అంటారు’’ అని అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు.
అయితే, అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలతో చాలా మంది విభేదిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- మోషన్ సిక్నెస్: వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్లో ఎలా కలిసింది?
- ఖైదీలు కళ్లజోడు, నీరు తాగడానికి స్ట్రా అడిగినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)