శభాష్.. రాష్ట్రాలు సమిష్టిగా పనిచేసి వైరస్ పారద్రోయాలి: నీతి ఆయోగ్ మీటింగ్లో మోడీ
అంతా సమిష్టిగా కలిసి కరోనా వైరస్ను దేశం నుంచి తరిమి కొట్టామని ప్రధాని మోడీ అన్నారు. ఆయన నీతి ఆయోగ్ ఏడో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతీ రాష్ట్రం కూడా తమ శక్తి మేరకు పనిచేసి.. వైరస్ నిర్మూలించగలిగిందని వివరించారు. అలా చేయడంతో ప్రపంచం ముందు భారత దేశం గొప్పగా నిలిచిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ తర్వాత తొలిసారి భౌతికంగా కలుసుకొని సమావేశం నిర్వహించారు. 2021లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.
సమావేశానికి 23 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు లెప్టినెంట్ గవర్నర్లు, ఇద్దరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సమావేశాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమన్వయపరిచారు.
వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం పెరగాలని అన్నారు. పంటల వైవిధ్యంపై అన్ని రాష్ట్రాలు దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా భారత్ ఎదగాలంటూ బలమైన ఆకాంక్షను వ్యక్తం చేశారు. పెరుగుతున్న పట్టణీకరణను శక్తిగా మార్చుకోవాలని సూచించారు.
వంటనూనెల ఉత్పత్తిలో దేశం స్వయంసమృద్ధి సాధించాలని తెలిపారు. భారత సమాఖ్య వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. వచ్చే ఏడాది జరిగే జీ-20 దేశాల సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తుందని ప్రధాని మోడీ వెల్లడించారు. జీ-20 సమావేశాల నుంచి గరిష్ఠ ప్రయోజనాలు పొందాల్సి ఉందని పేర్కొన్నారు.