వరుణుడి పలకరింపు: ఎండ వేడి, ప్రచార వాడి నుంచి ఉపశమనం: బెంగళూరులో వడగళ్ల వాన
Recommended Video
బెంగళూరు: ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందంటూ వాతావరణ శాఖ ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే- దాన్ని నిజం చేసేలా వరుణదేవుడు పలకరించాడు. రాజధాని బెంగళూరు సహా కర్ణాటక దక్షిణ ప్రాంతంపై కరుణ చూపాడు. బెంగళూరు సహా మైసూరు, హాసన జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. కొన్ని రోజులుగా ఎండ తీవ్రతను ఎదుర్కొంటున్న బెంగళూరియన్లకు కాస్త ఉపశమనం లభించినట్టయింది.
రెండో దశ పోలింగ్ కు సమాయాత్తమౌతున్న కర్ణాటకలో పోలింగ్ కు ముందురోజు వర్షం పడటం ఎన్నికల సిబ్బందికీ ఊరట కలిగించేదే. మధ్యాహ్నం వరకూ బెంగళూరులో ఎండ తీవ్రంగానే కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల తరువాత క్రమంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రచండ భానుడిని మబ్బులు కమ్మేశాయి. చిరుజల్లులతో ఆరంభమైన వర్షం.. క్రమంగా వేగం పుంజుకొంది. భారీగా కురిసింది.

శివార్లలోని అనేకల్, అత్తిబేలే, చందాపుర, హెబ్బగూడి, సర్జాపుర వంటి ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. జయనగర, బనశంకరి, బాణసవాడి వంటి చోట్ల వడగళ్ల వాన కురిసింది. ఆర్టీ నగర, సదాశివ నగర వంటి ప్రాంతాల్లో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఫలితంగా మాన్యతా టెక్ పార్క్ సమీపంలో చెట్లు నేలకూలాయి. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఓ యువకుడు గాయపడ్డాడు. రోడ్లపై వర్షపు నీరు చేరుకోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించి పోయాయి.

బెంగళూరుతో పాటు మండ్య, తుమకూరు, దావణగెరె, చిక్ మగళూరు, కొడగు వంటి చోట్ల కూడా తేలికపాటి వర్షపాతం నమోదైంది. మరో 48 గంటల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందంటూ కర్ణాటక వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం వరకూ కర్ణాటక వ్యాప్తంగా జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అరేబియా సముద్రం వెంట పరిస్థితుల వల్ల వాతవరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications