Kendriya Vidyalaya: టీచర్ల కొరతతో విద్యార్థుల ఇబ్బందులు..భర్తీ కానీ పోస్టులు ఎన్నంటే..?
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, డిఫెన్స్, పారామిలటరీ సిబ్బంది పిల్లలు చదువుకునే కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా 40శాతం కేంద్రీయ విద్యాలయాలకు ప్రిన్సిపల్ లేరు. గత మూడేళ్లలో టీచర్ల కొరత కూడా రెట్టింపు కావడం పిల్లల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. కరోనా కారణంగా టీచర్ల రిక్రూట్మెంట్ నిలిచిపోయింది. దీంతో చదువు చెప్పే టీచర్లు లేకపోవడంతో పిల్లలు కూడా సొంతంగా చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓ జాతీయ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన కొందరు ప్రధానోపాధ్యాయులు ఆందోళనతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రీయ విద్యాలయాల్లో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతతో చాలా ఇబ్బందిగా మారిందని చెప్పారు. కొందరు డబుల్ షిఫ్ట్లో పనిచేస్తున్నారని వాపోయారు. దీంతో విద్యాలయ పాలసీలకు వ్యతిరేకంగా సిబ్బంది ఒకే చోట ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు మరోప్రాంతానికి బదిలీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పారు. దూరప్రాంతాల్లో ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందికరంగా మారుతోందని చెప్పారు. అంతేకాదు సిబ్బంది కొరతతో పాటు విధానాల అమలు లోపంతో కేంద్రీయ విద్యాలయాల్లోని అకడెమిక్స్ పెర్ఫార్మెన్స్ కూడా గాడి తప్పుతోందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 10వ తరగతి 12వ తరగతి విద్యార్థుల అకడెమిక్స్ పెర్ఫార్మెన్స్ 2019 నుంచి 2022 మధ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని చెప్పారు. ఈ గ్యాప్ లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని చెబుతున్నారు.
ఇక ఉపాధ్యాయుల భర్తీపై వస్తున్న ఫిర్యాదులతో కేవీ వివరణ ఇచ్చింది. ఈ విద్యాసంవత్సరంలోనే కొత్త రిక్రూట్మెంట్లు జరుగుతాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 1247 కేంద్రీయ విద్యాలయాల్లో 250 విద్యాలయాలు గ్రేడ్ -2 స్కూల్స్ అని వాటికి ప్రిన్సిపాల్ అక్కర్లేదని, వాటి అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రిన్సిపాల్స్ చూస్తున్నట్లు కేవీ సిబ్బంది నుంచి సమాచారం వస్తోంది. మిగతా 1000 స్కూళ్లలో దాదాపు 420 స్కూళ్లకు ప్రిన్సిపాల్ అవసరం ఉన్నా అక్కడ లేరని తెలుస్తోంది.
కేంద్రీయ విద్యాలయాల్లో 2022 జూన్ నెల నాటికి 12,044 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గత నెలలో పార్లమెంటు వేదికగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి వెల్లడించారు.2019లో ఈ సంఖ్య 5,562గా ఉన్నింది.అయితే 9,161 పోస్టులను కాంట్రాక్ ప్రాతిపాదికన భర్తీ చేసినట్లు చెప్పారు.అయితే కేవీ వార్షిక నివేదిక ప్రకారం 2020-2021 మొత్తం 46,335 టీచర్ పోస్టులు శాంక్షన్ అయినట్లు తెలుస్తోంది. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో సిబ్బంది కొరత కూడా అంతే స్థాయిలో ఉందని సమాచారం.
" పిల్లల భద్రత, ఆ తర్వాత ఉపాధ్యాయుల హాజరు, సమయానికి క్లాసులు తీసుకుంటున్నారా లేదా అనేది ప్రాధాన్య అంశాలు. ఆ తర్వాతే విద్యార్థులు ఎలా చదువుతున్నారనేది చదువులో వారి ప్రదర్శన ఎలా ఉందని చూస్తాం. వీటిని సమీక్షించడంలో విఫలమైతే ఆ ఫలితం పెద్ద ప్రభావమే చూపుతుంది.కేంద్రీయ విద్యాలయాలు ఉన్నదే సైన్యంలో పనిచేసే జవాన్ల పిల్లలకోసం. ఇక్కడే విఫలమైతే జవాన్లకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నాం" అని ఓ ప్రిన్సిపల్ ప్రశ్నించారు.
మొత్తానికి జాతీయ విద్యా విధానం-2020 (National Education Policy-2022)ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, అందులో నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవాలంటే కచ్చితంగా ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ వెంటనే చేపట్టాలని తద్వారా కోవిడ్ ద్వారా విద్యార్థులకు జరిగిన నష్టం నుంచి పుంజుకోవాలని మరో అధికారి తెలిపారు.