ప్రియాంక గాంధీ తాగుబోతు: స్వామి, కాంగ్రెసు ఫైర్
న్యూఢిల్లీ: వారణాసి నుంచి బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే ఘోరంగా ఓడిపోయి ఉండేదనిస బిజెపి నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. దాంతో ఆగకుండా ఆయన ప్రియాంకపై ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక పచ్చి తాగుబోతు అని వ్యాఖ్యానించారు. ఆమెకు, ఆమె భర్త వధేరాకు ఎంతో చెడ్డపేరుందని ఆయన అన్నారు.
వారణాసి నుంచి పోటీకి దిగకుండా ప్రియాంక గాంధీని ఆమె కుటుంబ సభ్యులు కాపాడారని, లేకుంటే ఆమెకున్న చెడ్డపేరుకు చిత్తుచిత్తుగా ఓడిపోయేదని అన్నారు. తమ పార్టీ నేత వరుణ్ దారి తప్పలేదని ప్రియాంకే దారి తప్పారంటూ దుయ్యబట్టారు. తండ్రిని చంపిన హంతకులను చూసేందుకు జైలుకు వెళ్లి, తండ్రి పట్ల కృతఘ్నత చాటుకున్న విశ్వాసఘాతకురాలైన కూతురు ప్రియాంక' అని విమర్శించారు.
సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలపై మంగళవారం కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుబ్రమణ్యస్వామి ఇంటి వద్ద ధర్నాకు దిగాయి. ప్రియాంకపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళుతామన్నారు.
దీనిపై సుబ్రమణ్యస్వామి స్పందిస్తూ - తన వ్యాఖ్యలపై వారికేదైనా సమస్య ఉంటే కోర్టుకు వెళ్లాలని వ్యాఖ్యానించారు. సుబ్రమణ్య స్వామి హద్దులు దాటి వ్యాఖ్యలు చేశారని కాంగ్రెసు నేత అజయ్ మకెన్ అన్నారు. మహిళల పట్ల అటువంటి వ్యాఖ్యలు అనుచితమైనవని ఆయన అన్నారు.