చానల్స్ బ్యాన్పై సుజన, కేసీఆర్ తెలివైన వారని రాపోలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో చానళ్ల బ్యాన్ పైన రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడారు. ప్రభుత్వాలు మీడియాను పరోక్షంగా నిలువరించాలని చూడటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతికా స్వేచ్ఛ విలువైనదని, ఇది నాలుగో స్తంభం అన్నారు.
ఆర్టికల్ 19(1) ప్రకారం భావప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరముందన్నారు. ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయ పద్దతిలో విభజించారన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపర్చేలా ప్రసారాలు చేశారని కొన్ని చానెళ్లపై కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారన్నారు.
ఆ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసనసభ, మండలిలో తీర్మానం చేశారని, రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేయించిందన్నారు. జూన్ 16 నుంచి తెలంగాణలో ఏబీఎన్, టీ వీ9 ప్రసారాలు నిలిచిపోయాయన్నారు. చానెళ్ల ప్రసారాలను నిలిపివేసే అధికారం ఎంఎస్వోలకు ఉందా అని ప్రశ్నించారు.
ప్రసారాలను ఆపే హక్కు ఎంఎస్వోలకు లేదని గతంలో సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. సొంత ఎజెండాతో పాలించే అధికారం ఎవరికీ లేదన్నారు. తెలంగాణలో మీడియాపై ఆంక్షలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇన్ని రోజులుగా చానళ్లు బంద్ అయితే, ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు.
ఎంఎస్వోలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ఎంఎస్ఓలు మీడియాను తమ చేతుల్లోకి తీసుకున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభమని...దాన్ని ఎంఎస్ఓలు అనే ప్రైవేటు వ్యక్తులు నియంత్రించడం రాజ్యాంగవిరుద్ధమన్నారు. సుజనా ప్రసంగానికి తెరాస ఎంపీ కే కేశవ రావు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు.
రాపోలు ఆగ్రహం
కేసీఆర్ చాలా తెలివైన వ్యక్తి అని, మనసులో చెడు ఉద్దేశ్యాలు పెట్టుకునే ఆయన టీవీ9, ఏబీఎన్ చానెల్స్ పై కక్ష సాధింపు చర్యలకు దిగారని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాలతోనే ఎంఎస్ఓలు కావాలనే ప్రసారాలు నిలిపివేశారన్నారు. ఈ విషయంలో చానళ్లను తాను వెనకేసుకురావడం లేదని, అయితే వారు తమ తప్పుకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా నిషేధాన్ని విధించడం అన్యాయమన్నారు.
కేంద్రప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకుని ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలన్నారు. మీడియా సంస్థల మధ్య పోటీ నెలకొని ఉందన్నారు. కొన్ని మీడియా సంస్థలు వ్యాపార ప్రయోజనాలతో పని చేస్తున్నాయన్నారు. ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణ సీఎం తెలివిగా వ్యవహరిస్తున్నారన్నారు. అందులో భాగమే రెండు చానళ్ల ప్రసారాల నిలిపవేత అన్నారు.
మీడియా సంస్థలు తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చునని, అంతేగాని బంద్ చేయడం తగదని బీజేపీ ఉత్తరాఖండ్ ఎంపీ తరుణ్ విజయ్ అన్నారు. ఎంఎస్ఓలకు ప్రసారాలు నిలిపివేసే హక్కును ఎవరిచ్చారని ప్రశ్నించారు. మీడియాను కంట్రోల్ చేసే ప్రయత్నాలు దేశంలో జరుగుతున్నాయన్నారు. ఎంఎస్ఓల విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.