నిర్భయ దోషి క్యురేటివ్ పిటీషన్ కొట్టివేత: స్టే దరఖాస్తునూ తోసిపుచ్చిన సుప్రీం.. !
న్యూఢిల్లీ: పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న అక్షయ్ కుమార్ ఠాకూర్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటీషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఉరిశిక్ష తేదీపైన స్టే విధించాలని దాఖలు చేసిన దరఖాస్తును కూడా తోసిపుచ్చుతున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. క్యురేటివ్ పిటీషన్లో పొందుపరిచిన అంశాలు ఏవీ పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.
పాత తీర్పులతో పోల్చలేం.. స్టే దరఖాస్తు కూడా తోసివేత..
అక్షయ్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్పై అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిర్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యాహ్నం విచారణకు స్వీకరించింది. ఇదివరకు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా కేసుతో దీన్ని పోల్చలేమని వెల్లడించింది. దీన్ని కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.
మూడో క్యురేటివ్ పిటీషన్..
ఇదే కేసులో సుప్రీంకోర్టుకు అందిన మూడో క్యురేటివ్ పిటీషన్ ఇది. ఇదివరకు వినయ్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ సింగ్ వేర్వేరుగా ఈ క్యురేటివ్ పిటీషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఏకంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. దాన్ని కొట్టివేసింది ధర్మాసనం. తాజాగా- అక్షయ్ కుమార్ ఠాకూర్ పిటీషన్ మరి కాస్సేపట్లో విచారణకు రానుంది.
ఉరిశిక్షను వాయిదా వేయించుకోవడానికేనంటూ..
ఉరిశిక్షను అమలు చేయడానికి ఉద్దేశించిన డెత్ వారెంట్ను జారీ చేసిన తరువాత ఈ పరిణామాలన్నీ ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఉరిశిక్షను వాయిదా వేయించడానికే దోషులు ఇలా వరుసగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారంటూ ఇదివరకే నిర్భయ తల్లి ఆశాదేవి ధ్వజమెత్తారు. ఈ నెల 22వ తేదీ నాటికే అక్షయ్ కుమార్ ఠాకూర్, పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ సింగ్లకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉండగా.. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటీషన్ను దాఖలు చేయడంతో కుదరలేదు.