నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు: ముఖేష్ సింగ్ పిటీషన్ కొట్టివేత..!
న్యూఢిల్లీ: పారా మెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటోన్న ముఖేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటీషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ముఖేష్ కుమార్ సింగ్ ఇదివరకే దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటీషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఇటీవలే అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్పై విచారణ నిర్వహించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. బుధవారం ఉదయం దీన్ని కొట్టేసింది.
అసందర్భ వాదనలు వినిపించినట్లు..
ముఖేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటీషన్పై జస్టిస్ భానుమతి, జస్టిస్ బొపన్న, జస్టిస్ అశోక్ భూషణ్లతో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారమే విచారణ ప్రక్రియనుముగించింది. తీర్పును బుధవారానికి రిజర్వ్ చేసింది. ముఖేష్ కుమార్ తరఫున ప్రముఖ న్యాయవాది అంజనా ప్రకాష్, ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. వాదనల పట్ల ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలను చేసింది. పిటీషన్ తరఫు న్యాయవాది అసందర్భ అంశాలను ప్రస్తావించినట్లు అభిప్రాయపడింది.
ముఖేష్పై లైంగిక దాడి అంటూ..
ముఖేష్ కుమార్పై తీహార్ కేంద్ర కారాగారంలో పలుమార్లు అత్యాచారం చోటు చేసుకుందని, లైంగిక దాడికి గురయ్యాడని అంజనా ప్రకాష్ వాదించారు. అతణ్ని చిత్రహింసలకు గురి చేశారంటూ పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం ఏకీభవించలేదు. రాష్ట్రపతికి దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటీషన్లో వాటి గురించి ప్రస్తావించారా? అని ప్రశ్నించగా.. సమాధానం రాలేదు. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముఖేష్ కుమార్ పిటీషన్ను కొట్టి వేసినట్లు ధర్మాసనం పేర్కొంది.
Recommended Video
ఇక రోజులు లెక్కబెట్టుకోవాల్సిందే..
కాగా.. ముఖేష్ కుమార్ పిటీషన్ను కొట్టేయడం పట్ల నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు కామాంధులు ఇక రోజులు లెక్కబెట్టుకోవాల్సి ఉంటుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉన్నప్పటికీ.. తప్పించుకున్నారని అన్నారు. రెండోసారి డెత్ వారెంట్ తప్పనిసరిగా అమలు జరిగి తీరుతుందని చెప్పారు.