తెలుగు పాలిటిక్స్ పై సుప్రీంకోర్టుకే వైరాగ్యం ! ఒకే రోజు రెండు కేసుల్లో స్పష్టం-కీలక కేసులపై ప్రభావం ?
జాతీయ రాజకీయాలన్నీ ఓ ఎత్తయితే తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న ప్రతీకార రాజకీయాలు మరో ఎత్తుగా మారాయి. ముఖ్యంగా అధికారం సాధించే వరకూ సాగే రాజకీయం ఓ ఎత్తయితే అది సాధించాక దాన్ని నిలబెట్టుకునేందుకు సాగించే రాజకీయం మరో ఎత్తుగా మారుతోంది. దీనికి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి తేడా కనిపించడంలేదు. ముఖ్యంగా సీఎంలు జగన్, కేసీఆర్ తమ ప్రత్యర్ధుల్ని టార్గెట్ చేస్తున్న తీరు ఇప్పుడు సుప్రీంకోర్టు గుర్తించే వరకూ వెళ్లిపోయింది. గుర్తించడమే కాదు విరక్తి చెందే దాకా వెళ్లింది. నిన్న రెండు వేర్వేరు కేసుల్లో సుప్రీంకోర్టు స్పందించిన తీరు చూస్తే ఇదెంత వాస్తవమో అర్ధమవుతుంది.
తెలుగు రాష్ట్రాలపై సుప్రీంకోర్టు విరక్తి
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్ధుల్ని లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీలైన టీఆర్ఎస్, వైసీపీ చెలరేగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రజలు తమకు అప్పగించిన అధికారాన్ని ప్రజాశ్రేయస్సుకు వాడటం కంటే తమ రాజకీయ ప్రత్యర్ధుల్ని టార్గెట్ చేసేందుకే ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో ఇది స్పష్టమైంది. ఇప్పుడు తాజాగా మరో రెండు విషయాల్లో తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న ప్రతీకార రాజకీయాల్ని సుప్రీంకోర్టు సైతం గుర్తించింది. అంతే కాదు దీనిపై వైరాగ్యం ప్రదర్శిస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల పిటిషన్ పై
హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి రప్పించేందుకు ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలపై కాషాయ పార్టీకి సన్నిహితులైన నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకుంటారా అని అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు విధించిన రిమాండ్ పై వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అసలు బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ఎలా విచారణకు స్వీకరించిందని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన బెంచ్ ప్రశ్నించింది. దీంతో ఈ వ్యవహారం సంచలనం రేపింది.
మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దుపై
అలాగే ఏపీలో టీడీపీ మాజీ మంత్రి నారాయణకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అక్రమాలకేసులో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ప్రతీకార రాజకీయాలకు సుప్రీంకోర్టును వేదిక చేసుకుంటారా అని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన అదే బెంచ్ సీరియస్ అయింది. నారాయణ విచారణకు సహకరించకపోతే కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అంతేకానీ బెయిల్ రద్దుకు తమను కోరడమేంటని ప్రశ్నించింది.
భవిష్యత్ కేసులపై ప్రభావం ?
సుప్రీంకోర్టులో ఇప్పటికే అమరావతి రాజధాని పిటిషన్లతో పాటు తెలంగాణకు చెందిన పలు కేసులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై త్వరలో విచారణ జరగి తీర్పులు రావాల్సి ఉంది. కానీ ఓసారి సుప్రీంకోర్టు గనుక తెలుగు రాష్ట్రాల ప్రతీకార రాజకీయాలపై ఓ అభిప్రాయానికి వస్తే మాత్రం అది కచ్చితంగా రాబోయే కేసులపై ప్రభావం చూపే అవకాశాలూ లేకపోలేదు. ముఖ్యంగా ఏపీలో అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానులు తెస్తున్న వైసీపీ సర్కార్ ఇందులో మాజీ మంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసేలా దాఖలు చేస్తున్న కేసులు సుప్రీంకోర్టు వరకూ వెళితే ఇందులో గతంలో కేసుల విచారణ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యల ప్రభావం కచ్చితంగా పడుతుంది. అప్పుడు ప్రభుత్వాలకే కాదు ప్రతిపక్షాలకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు.